14 క్వింటాళ్ల పత్తి విత్తనాలు పట్టివేత
అదుపులో ఇద్దరు నిందితులు
కొడంగల్, జూన్ 14: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లో చేపట్టిన తనిఖీల్లో నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. టాస్క్ఫోర్స్ సీఐ వెంకటేశానికి అందిన సమాచారంతో ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్తో కలిసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. కొడంగల్ మండలంలోని చిన్ననందిగామ గ్రామంలో నకిలీ విత్తనాలు ఉన్నట్లు అందుకున్న సమాచారం మేరకు గ్రామంలోని పగిడాల సిద్దు నివాసంలో తనిఖీలు నిర్వహించగా 25 కేజీల నకిలీ విత్తనాలు దొరికినట్లు తెలిపారు. పట్టుబడ్డ సిద్దును అదుపులోకి తీసుకొని విత్తనాలు లభ్యంపై విచారించగా దౌల్తాబాద్ మండలంలోని గోకాఫల్వాద్లో గట్టమనేని వెంకటరమణ వద్ద నుంచి తీసుకొస్తున్నట్లు తెలపారని వివరించారు.
మంగళవారం వెంకటరమణ నివాసంలో తనిఖీ చేయగా 14 క్వింటాళ్ల పత్తి విత్తనాలు లభించినట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.16,80,000లు ఉంటుందని, ఈ నకిలీ విత్తనాల అమ్మకం మహబూబ్నగర్ జిల్లాలోని అమిస్తాపూర్లో స్థావరం ఉందని, విక్రయించే వసంత శ్రీనివాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కొడంగల్, పరిగి, దౌల్తాబాద్, యాలాల్, తాండూర్లతో కలిపి మొత్తంగా 6 కేసులు నమోదు కాబడదినట్లు తెలిపారు. ఈ సంవత్సరం మొత్తంగా 38 క్వింటాళ్ల పత్తి విత్తనాలు పట్టుబడినట్లు తెలిపారు. అదేవిధంగా అక్రమ రేషన్ బియ్యం రవాణాలో ఇప్పటి వరకు 10 కేసులు నమోదయ్యాయని, ఇటీవల 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకొని కేసు నమోదు చేసినట్లు వివరించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ ఎస్ఐ ఇఫ్తేఖార్అహ్మద్, ఎస్ఐ రవిగౌడ్, వ్యవసాయాధికారి ఏవో బాలాజీప్రసాద్ పాల్గొన్నారు.