సిరిసిల్ల తెలంగాణ చౌక్, ఏప్రిల్ 27: అంతర్జాతీయ నకిలీ ఏజెంట్ల ముఠా గుట్టురట్టయింది. కంబోడియా దేశంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలిప్పిస్తామని యువకులకు వల వేసి, అక్కడ మాత్రం సైబర్ క్రైం కోరల్లోకి నెట్టివేస్తున్న బాగోతం బయటపడింది. వినకుంటే ముప్పులు తిప్పలు పెట్టడమే కాదు, పాస్పోర్టు ఇవ్వకుండా వేధిస్తున్నట్టు తెలుస్తున్నది. జిల్లాకు చెందిన ఓ బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూరుకు చెందిన అతికం శివప్రసాద్ డిగ్రీ దాకా చదువుకున్నాడు. ఉపాధి కోసం చూస్తున్నాడు.
ఈ క్రమంలో కొడిమ్యాలకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్ అనే ఏజెంట్ను సంప్రదించాడు. కంబోడియా దేశంలోని ఓ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్ కొలువులు ఉన్నాయని, వీసా కోసం 1.40లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో శివప్రసాద్ అందజేశాడు. గత జనవరిలోనే కంబోడియా దేశం వెళ్లాడు. సాయిప్రసాద్ సూచించిన మేరకు అక్కడి ఓ చైనీస్ కంపెనీలో చేరాడు. వాళ్లు శివప్రసాద్ పాస్పోర్టు తీసుకొని కంప్యూటర్ ఆపరేటర్ కొలువు కాకుండా సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో బాధితుడి తల్లి లక్ష్మి నాలుగు రోజుల కింద జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి తన కొడుకు మోసపోయాడని, కాపాడాలని వేడుకున్నది.
ఈ క్రమంలో పోలీసులు వాట్సప్ కాల్లో శివప్రసాద్తో మాట్లాడగా, అతను పూర్తి వివరాలు వెల్లడించాడు. తాను కంబోడియా వెళ్లిన తర్వాత తన పాస్పోర్టును చైనీస్ కంపెనీ లాక్కున్నదని చెప్పాడు. తనకు కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పినప్పటికీ.. అక్కడ కాల్ సెంటర్లో సైబర్ మోసాలు చేయిస్తున్నారని, ఇండియన్ నంబర్స్ ఇచ్చి లాటరీ, జాబ్ ఫ్రాడ్స్ చేయిస్తున్నారని వాపోయాడు. అధిక మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆశ చూపుతున్నారని, టార్గెట్లు ఇచ్చి మరీ పని చేయిస్తున్నారని, ఒకవేళ వినకుంటే వేధిస్తున్నారని, తాము వెళ్తామన్నా పాస్పోర్టు ఇవ్వడం లేదని తెలిపాడు. తన లాగే భారత దేశానికి చెందిన సుమారు 500 నుంచి 600 మంది ఉన్నారని చెప్పాడు.
వెంటనే సిరిసిల్ల టౌన్ ఠాణాలో కేసు నమోదు చేసిన పోలీసులు, కంబోడియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులను సంప్రదించారు. బాధితుడి వివరాలు అందించడంతో అక్కడి పోలీసులు శివ ప్రసాద్ను రెస్క్యూ చేశారని, రెండు రోజుల్లో ఇండియాకు చేరుకుంటారని ఎస్పీ వివరించారు. కాగా, ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఏ1 నిందితుడైన కంచర్ల సాయి ప్రసాద్పై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకొని విచారించామని ఎస్పీ చెప్పారు. సాయిప్రసాద్ 10వేలు కమీషన్ తీసుకొని వీసా కోసం పాస్పోర్టును లక్నోకి చెందిన ఏ2 నిందితుడైన సదాకత్ (ప్రస్తుతం మాల్దీవుల్లో ఉంటున్నాడు)కు పంపించాడు.
అతను పూణేకు చెందిన ఏ3 నిందితుడైన అబిద్ అన్సారీకి పంపించగా, ఆయన ఏ4 నిందితుడైన బీహార్ రాష్ర్టానికి చెందిన షాదాబ్ (ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నాడు)కు పంపించినట్టు వివరించారు. ఈ క్రమంలో షాదాబ్.. శివప్రసాద్ను కంబోడియా దేశానికి పంపినట్టు చెప్పారు. నలుగురు నిందితుల్లో కంచర్ల సాయి ప్రసాద్ను, పూణేలో ఉన్న ఆబిద్ అన్సారీని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మిగితా ఇద్దరినీ త్వరలోనే పట్టుకోనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా నకిలీ ఏజెంట్ల ద్వారా మోసపోయిన బాధితులు నేరుగా స్పెషల్ బ్రాంచీ అధికారి 87126-56411ను సంప్రదించి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సూచించారు.