తిరుమల : వేసవి సెలవుల్లో తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ ఈవో (TTD EO) ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన డయల్యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాదానం ఇచ్చారు. తిరుమలలో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ (Buttermilk), తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఆలయ మాడ వీధుల్లో, భక్తుల సంచారం ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ, ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు చలువపందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు (Carpets) ఏర్పాటు చేశామని వివరించారు. నేలపై నీళ్లతో ఎప్పటికప్పుడు పిచికారి చేస్త్తున్నామని, నారాయణగిరి ఉద్యానవనాలు, ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటుచేశామన్నారు.
తిరుమలలోని ఆకాశగంగ వద్ద బాలాంజనేయస్వామివారి ఆలయంలో జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.