Blinkit Blinks | అసలు కన్నా కొసరు ఎప్పుడూ గొప్పే! కూరగాయల దగ్గర కొసరు కబుర్లు అసలు బేరసారాలకన్నా పసందుగా సాగుతాయి. కిలోల కొద్దీ కూరగాయలు కొన్నప్పుడు కొసరుగా ఓ కొత్తిమీర కట్టో, కరివేపాకు రెమ్మో వేస్తేనే మనకు తృప్తి. కూరగాయలబ్బి ముఖం మాడ్చినా కొసరు దగ్గర రాజీపడని తత్వం మధ్యతరగతి అమ్మ సుగుణం! అలాంటి ఓ తల్లి ఏకంగా బ్లింకిట్నే కొసిరింది. ముంబయికి చెందిన అంకిత్ సావంత్ బ్లింకిట్లో కూరగాయలు ఆర్డర్ ఇచ్చాడు. అందులో కొత్తిమీర కట్టకూ రేటు ఉండటం చూసి అతని తల్లి మనసు చివుక్కుమంది.
‘ఇన్నేసి రూపాయలు తగలేస్తూ.. కొత్తిమీరకూ లెక్కేంట’ని తనయుడిని కొరకొరలాడింది. అమ్మ ధర్మాగ్రహాన్ని అర్థం చేసుకున్న అంకిత్.. కొసరనివ్వకపోవడాన్ని నిరసనగా బ్లింకిట్ సీఈవోను ట్యాగ్ చేస్తూ ఎక్స్లో ఓ పోస్టు పెట్టాడు.‘బ్లింకిట్లో కొత్తిమీర కట్టకూ రేటు కట్టడం చూసి మా అమ్మకు చిన్నపాటి గుండెపోటు వచ్చినంత పనైంది’ అని పెదవి విరిచాడు.
అంతటితో ఆగకుండా “ఇంత మొత్తం వెచ్చించి కూరగాయలు తీసుకున్న వినియోగదారులకు ఉచితంగా కొత్తమీర కట్ట ఇస్తే బాగుంటుంద’ని మా అమ్మ సలహా’ అంటూ కొసరు మెసేజ్ పెట్టాడు. ఏ కలనున్నాడో గానీ, అంకిత్ పోస్టుకు అప్పటికప్పుడు స్పందించాడు బ్లింకిట్ సీఈవో అల్బిందర్ దిండ్సా. కూరగాయల ఆర్డర్పై 100 గ్రాముల కొత్తిమీరను కొసరుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు.
అలా ఉచితంగా కొత్తిమీర పొందిన ఆర్డర్ స్క్రీన్ షాట్ను జతచేస్తూ.. ‘అంకిత్ అమ్మగారికి ధన్యవాదాలు చెప్పండి. కొత్తమీర కొసరు ఇవ్వడం మొదలైంది. రెండువారాల్లో మరింత పక్కాగా దీన్ని అమలు చేస్తాం’ అని పోస్టు పెట్టాడు. మొత్తంగా ఈ ముంబయి అమ్మ కోరిన కొత్తిమీర కొసరు అందరికీ అందడం విశేషం. అంకిత్, దిండ్సా ఎక్స్లో చేసిన పోస్టులు కొత్తిమీర పరిమళం కన్నా వేగంగా వైరల్ అయ్యాయి.