Income Tax | న్యూఢిల్లీ, మే 25: ఎన్నికల ఫలితాలకుతోడు.. ఇప్పుడు మదుపరులకు మరో భయం జత కలిసింది. ఈ నెలారంభంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,100 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుత లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో మరోమారు బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే దేశంలో ప్రస్తుతం అమలవుతున్న పన్నుల విధానంలో భారీ మార్పులకే ఆదాయ పన్ను (ఐటీ) శాఖ సిద్ధమవబోతున్నదన్న అంచనాలే ఇందుకు కారణం. పన్ను మినహాయింపులకు కోతలు పెట్టడం, జరిమానాలను ఇంకా పెంచడమేగాక.. అన్ని తరగతులవారికీ ఒకే పన్ను పడేలా ఐటీ శాఖ ముందుకెళ్తోందని అంటున్నారు మరి. ప్రస్తుతం భారత్లో ఆదాయాన్నిబట్టి రకరకాల పన్ను శ్లాబులున్న విషయం తెలిసిందే.
ఈక్విటీ ఇన్వెస్టర్లకు దెబ్బ
ఐటీ శాఖ తీసుకురావాలని చూస్తున్న మార్పులు వాస్తవ రూపం దాల్చితే.. దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే మదుపరులకు పెద్ద దెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రుణ మార్కెట్లలో మదుపు చేస్తున్నవారితో పోల్చితే ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేవారికి వివిధ పన్ను ప్రోత్సాహకాలు లభిస్తుండటమే ఇందుకు కారణంగా వారు చెప్తున్నారు. పన్ను ప్రయోజనాలే లేకపోతే చాలామంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు ముందుకు రాలేరని అంటున్నారు. కాబట్టి పన్ను విధానాల్లో మార్పులు స్టాక్ మార్కెట్ల నష్టాలకు దారితీస్తాయని కూడా మెజారిటీ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంచనాలను కొట్టిపారేస్తున్నా.. ఇన్వెస్టర్లలో ఇప్పటికే నెలకొన్న భయాలు మాత్రం వీడటం లేదు.
ప్రస్తుతానికైతే..
ప్రస్తుతం స్టాక్స్, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ల్లో పెట్టుబడులపై ఏడాదిలోపే లాభాలను అందుకుంటే మదుపరులు దానిలో 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను (ఎస్టీసీజీ)గా చెల్లించాల్సి వస్తున్నది. పెట్టుబడులు పెట్టిన ఏడాది తర్వాత లాభాలను ఆర్జిస్తే అందులో 10 శాతాన్ని దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)గా కట్టాల్సి వస్తున్నది. ఇక ఒక్కో క్యాపిటల్ అసెట్కు ఒక్కోలా ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతున్నది.
జూలైలో రాబోయే కేంద్ర బడ్జెట్లో మూలధన లాభాల పన్నులో ఏమైనా మార్పులుంటే.. భారతీయ మార్కెట్లలో దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో బీజేపీ సాధించే సీట్లు కూడా స్టాక్ మార్కెట్లను నిర్దేశించగలవు. అయితే ఎన్నికల ఫలితం ఎలాగున్నా.. పన్ను విధానంలో మార్పులు మాత్రం భారీ నష్టాలకే దారి తీయగలవు. అదీగాక రిటైల్ ఇన్వెస్టర్లకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను పెంచాలన్న ప్రతిపాదన కూడా వినిపిస్తున్నది. ఏమైనా పన్నుల భారం పెరిగితే మదుపరులు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. 2004లో బీజేపీ ప్రభుత్వం ఓటమిపాలైతే కేవలం రెండు సెషన్లలో మార్కెట్లు 17 శాతానికిపైగా క్షీణించాయి. ఈసారి బీజేపీ ఓడిపోయినా ఆ స్థాయి నష్టాలు రాకపోవచ్చుగానీ.. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను సవరిస్తే మాత్రం అంతకన్నా ఎక్కువ నష్టాలు వాటిల్లుతాయని చెప్పవచ్చు.
-క్రిస్టోఫర్ వుడ్, జెఫెరీస్ బ్రోకరేజీ నిపుణుడు