Supari Killing | నాగపూర్, జూన్ 12: తగినంత జీతం..మంచి జీవితం.. సమాజంలో మంచి గౌరవం ఉన్నా మామకు ఉన్న రూ.300 కోట్ల ఆస్తి కోసం అత్యాశ పడింది ఓ కోడలు. అతడిని కారుతో ఢీ కొట్టి చంపించి ఆస్తి కాజేయాలనుకొంది. ఇందుకోసం రూ.1 కోటి సుపారీ ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే పోలీసుల నిశితంగా దర్యాప్తు చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. నాగపూర్ పోలీసుల కథనం ప్రకారం… అర్చన మనీశ్ పుట్టెవార్(53) ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తుంది. ఆమె భర్త మనీశ్ వైద్యుడు. ఇటీవల అర్చనకు మామ పురుషోత్తం పుట్టెవార్(82) ఆస్తిపై కన్ను పడింది. అత్త శకుంతల అనారోగ్యంతో ఉండటంతో.. మామను అడ్డు తొలిగించుకుంటే రూ.300 కోట్ల విలువైన కుటుంబ ఆస్తి మొత్తం తన సొంతం అవుతుందని ఆలోచన చేసింది. మామ హత్యకు కుట్ర పన్నింది. తన భర్త వద్ద డ్రైవర్గా పని చేసే బగ్డే, అతడి స్నేహితులు నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్కు మామను అంతమొందించే పని అప్పగించింది.
దాదాపు 15 రోజుల క్రితం దవాఖానలో చికిత్స పొందుతున్న తన భార్య శకుంతలను కలిసి పురుషోత్తం బయటకు వస్తుండగా బగ్డే, అతడి మిత్రులు కారుతో ఢీ కొట్టి పారిపోయారు. ఈ ఘటనలో పురుషోత్తం ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన కాదని పోలీసులు అనుమానించారు. లోతైన విచారణ జరపగా అర్చన పన్నిన కుట్ర బయటపడింది. దీంతో పోలీసులు ఆమెతో పాటు హత్యకు పాల్పడ్డ మరో ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితురాలు టౌన్ప్లానింగ్ శాఖలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. వాటిని తవ్వి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.