హుజూరాబాద్టౌన్ : నికార్సయిన తెలంగాణ ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని, గెల్లు గెలుపు నియోజకవర్గ అభివృద్ధికి మలుపుగా మారుతుందని కుడా చైర్మన్, తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి తెలిపారు. కరపత్రాల ద్వారా గ్రామ గ్రామాన ప్రజలను చైతన్య పరుస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని పట్టభద్రులు ప్రచారం చేస్తారని మర్రి యాదవరెడ్డి తెలిపారు.
హుజూరాబాద్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మోతే చిరంజీవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 30న జరగనున్న హుజూరా బాద్ ఉప ఎన్నికల్లో పో్స్ట్ గ్రాడ్యుయేట్ పట్టభద్రుడు అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం పట్టభద్రులు అందరూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తారన్నారు.
గత ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ చలవతో ఎమ్మెల్యేగా, మంత్రిగా గెలిచి తిన్నింటి వాసాలు లెక్కించేలా పార్టీలో ఉంటూ పార్టీ పరువు తీసేందుకు ప్రయత్నించాడన్నారు. పట్టభద్రులు ఆలోచించి యువకు డైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ మంచితనాన్ని, చురుకుదనాన్ని ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించేలా కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మోతే చిరంజీవి, హుజూరాబాద్ మండల అధ్యక్షుడు ఎల్బి మల్లేశం, ప్రధాన కార్యదర్శి భరత రజనీకాంత్, సైదాపూర్ మండల అధ్యక్షుడు తిప్పారపు బిక్షపతి, సిర్సపల్లి, వెంకట్రావుపల్లి, పోతిరెడ్డిపేట అధ్యక్షులు సాయి, పంబాల శ్రీనివాస్, శ్రీను, జమ్మికుంట మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంజిబాబు, వేణు తదితరులు పాల్గొన్నారు.