నీలగిరి, జనవరి 25 : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో ఆయా శాఖలు, విద్యా సంస్థ ల సహకారంతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమె మాట్లాడుతూ పరిపాలన విధానానికి ఓటు ఆయుధం లాంటిదని,18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. నేటి విద్యార్థులే రేపటి బావి పౌరులని, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులను చైతన్య పరిచి ఓటు వినియోగాన్ని తెలియజేయాలని చెప్పారు.
ఈ సందర్బంగా కొత్తగా ఓటరు అయిన వారికి కలెక్టర్ ఎపిక్ కార్డులు అందజేశారు. అనంతరం జిల్లా అధికారులు, హాజరైన వారు ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీఓ ఎన్.రవి, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ పాల్గొన్నారు.