హుజూరాబాద్: ఈటల రాజేందర్ పక్కా స్వార్థపరుడని, తమను ఏనాడూ పట్టించుకోలేదని ఆయన బంధువులు మండిపడ్డారు. ఈటల రాజేందర్ స్వగ్రామం కమలాపూర్కు చెందిన పలువురు గ్రామస్తులు, ఈటల సమీప బంధువులు హుజూరాబాద్లో మంత్రి హరీశ్రావును కలిసి తమ ఆవేదన వ్యక్తంచేశారు. హరీశ్రావు సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. వారు మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ గ్రామానికి చెందిన కొద్దిమందిని మాత్రమే ఆదరించాడని, వారంతా ఈటల అండతో పైరవీలు చేసుకొని కోట్లకు ఎదిగారని వాపోయారు.
ఈటల రాజేందర్ సోదరి తమ మత్స్యకార సంఘ భవనానికి తాళం వేసిందని, తమ ఇంట్లోని మగవారిపై పోలీసు కేసులు పెట్టి వేధించిందని మహిళలు హరీశ్రావుతో గోడు వెళ్లబోసుకున్నారు. తాము ఈటల రాజేందర్ వీధిలోనే ఉంటున్నా ఏనాడూ తమ బాగోగులు పట్టించుకోలేదని ఇరుగుపొరుగువారు వాపోయారు. తమపైనే పోలీసు కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇన్నిసార్లు గెలిపించినా ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కట్టియ్యలేదని పేర్కొన్నారు. తామంతా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కే ఓటేస్తామని స్పష్టం చేశారు.