అశ్వారావుపేట రూరల్, ఫిబ్రవరి 24 :అది ఓ కుగ్రామం. 400 లోపు జనాభా ఉంటుంది. అక్కడ గిరిజన జనాభే అత్యధికం. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆ పాఠశాలకు వెళ్తే ఆహ్లాదకర వాతావరణం స్వాగతం పలుకుతుంది. పాఠశాలలో గోడలే పాఠాలు చెబుతాయి. పాఠశాల ప్రహరీ నుంచి తరగతి గదుల వరకు రంగురంగుల పెయింటింగ్స్ కనువిందు చేస్తున్నాయి. ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవతో పాఠశాల రూపురేఖలు మారాయి. విద్యార్థులకు ఆటపాటలతో విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో కార్పొరేట్కు దీటుగా విద్యబోధన అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది. ఫర్నీచర్ ఉండదు, ఉపాధ్యాయులు సక్రమంగా రారు. ఫ్యాన్లు, గేట్లు ఉండవు అనే అపవాదు ఉంది. కానీ, ఆ స్కూల్కి వెళ్తే ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాల పోటీ పడుతున్నది. ప్రధానోపాధ్యాయుడు రాములు, ఉపాధ్యాయురాలు తిరుపతమ్మ ప్రత్యేక చొరవతో పలువురు దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించారు. ప్రహరీ, ప్రధాన ద్వారం ఇరువైపులా రంగురంగుల బొమ్మలు, వెల్కం టూ ఆవర్ స్కూల్ కొటేషన్తో విద్యార్థుల బొమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. పలు బొమ్మలు విద్యార్థులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రధానోపాధ్యాయుడు రాములు సొంత నిధులు రూ.25 వేలతో పాఠశాలలో భోజనశాల నిర్మించారు. సర్పంచ్ మడకం స్వరూప, టీఆర్ఎస్ నేత రాజమోహన్రెడ్డి సాయంతో మహాత్మాగాంధీ, సరస్వతి దేవి విగ్రహాలను ఏర్పాటు చేశారు. నారంవారిగూడెం సర్పంచ్, చిట్టితల్లి సేవా సమితి వ్యవస్థాపకుడు మనుగొండ వెంకటముత్యం రూ.25 వేలతో బీరువా, మైకు, ఫ్యాన్లు, ర్యాక్లు, కుర్చీలు కొనుగోలు చేశారు. లక్ష్మీతులసి పేపర్ బోర్డు 10 బల్లలు అందజేశారు. ఉపాధ్యాయులు రాములు, తిరుపతమ్మ విధుల్లో చేరినప్పటి నుంచి పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఎలాంటి ఆదరణ లేని పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఐటీడీఏ నిధులు రూ.2.50 లక్షలతో ప్రహరీ నిర్మించారు. మరుగుదొడ్లు, పాఠశాల శ్లాబ్కు మరమ్మతులు చేశారు. రూ.6వేలతో ప్రధానోపాధ్యాయుడు రాములు రంగులు వేయించారు.
చదువంటే ఇష్టపడని విద్యార్థులను సైతం ఆకర్షించేలా ఆటపాటలతో బోధిస్తున్నారు. విద్యార్థులకు గుర్తుండిపోయేలా చిన్న చిన్న పదాలు గోడలపై రాశారు. ఆలోచింపజేసే బొమ్మలను గోడలపై వేయించారు. విదార్దులకు అర్థమయ్యే విధంగా సులభంగా బోధిస్తున్నారు. దీంతో విద్యార్థుల చదువుపై ఆసక్తి చూపిస్తూ పాఠశాలకు వస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం బోధనతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుతం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా దాతల సాయంతో పాఠశాలను నందనవనంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.