స్వరాష్ట్ర ఉద్యమంలో వ్యక్తీకరింపబడిన ప్రజల ఆకాంక్షల మేరకు కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తెలంగాణలో మౌలిక రంగాలను అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్నది. ప్రజల జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న వ్యవసాయరంగాన్ని మొదటి ప్రాధాన్యంగా ఎంచుకొని.. కరువు కాటకాలతో తల్లడిల్లిన శుష్క ప్రాంతాన్ని ఆకుపచ్చని సీమగా మార్చారు. ఇదే క్రమంలో భవిష్యత్ తరాలకు బంగారుబాటలు వేసేవిధంగా.. ప్రభుత్వ పాఠశాల విద్యారంగాన్ని సమూలంగా మార్చటంపై దృష్టిపెట్టారు. దీంట్లో భాగమే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అమలు. ఇది రానున్న రోజుల్లో గొప్ప ఫలితాలను సాధించనున్నది.
అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్ల వలస పాలనలో సుదీర్ఘకాలం పాటు మగ్గి, విముక్తి పొందిన లాటిన్ అమెరికా దేశాలు ఆ తర్వాత కాలంలో ఎంతో అభివృద్ధిని నమోదు చేశాయి. ఆయా దేశాల విముక్తి ఉద్యమాలలో ఆవిర్భవించిన నేతలు.. నిర్దిష్టమైన ప్రణాళికలతో ప్రజల వికాసం కోసం ఎంతో తపనతో పనిచేశారు. ఆ లాటిన్ అమెరికా దేశాలు మానవాభివృద్ధి సూచికలలో మెరుగుపడిన తీరును చరిత్ర తెలియజేస్తుంది. తెలంగాణలో ఇప్పుడు ఈ చరిత్ర నిర్మాణమవుతున్నది. వలస పాలకుల కాలంలో లాటిన్ అమెరికన్ దేశాల వంటి సమస్యలనే తెలంగాణ ఎదుర్కొన్నది. అటువంటి తెలంగాణను స్వరాష్ట్రంగా మార్చి, ఉద్యమకాలం నాటి స్ఫూర్తికి రెట్టింపు ఉత్సాహంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. దీంట్లో భాగమే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన.
తెలంగాణ ప్రభుత్వ విధాన పత్రంలో.. ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలకు పెద్దపీట వేశారు. 2030 నాటికి సమ్మిళిత, సమాన నాణ్యతగల విద్యను అందించడం, అందరికీ జీవితకాలం పాటు అభ్యసన అవకాశాలు కల్పించటం, విద్య-ఆరోగ్యం-ఆదాయం పెంపొందించి మానవాభివృద్ధి సూచికలో మెరుగైన స్థానం పొందటం.. మొదలైన లక్ష్యాల అమలుకు కార్యాచరణను ప్రకటించడం సంతోషదాయకం. ప్రభుత్వ విద్యాసంస్థలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, రూ.7,280 కోట్లతో ‘మన ఊరు-మన బడి’ పథకం, ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావడం వంటి చర్యలన్నీ ఈ కార్యాచరణలో భాగమే.
నాగరికత నిర్మాణంలో భాష కీలకమైన పాత్ర పోషిస్తుంది. పారిశ్రామిక విప్లవం నుంచి పుట్టిన జ్ఞానం, తార్కికత మొదలగు అంశాలు ఆధునిక ప్రపంచ నిర్మాణానికి దోహదం చేశాయి. అయితే ఈ జ్ఞానం ఆంగ్లభాషలో పోగుపడింది. మన దేశానికి సంబంధించినంతవరకూ ఇంగ్లిష్ ప్రాధాన్యాన్ని తొలిసారిగా రాజా రామ్మోహన్ రాయ్ గుర్తించటమే గాక, తోటి భారతీయులకు ఆ విషయాన్ని తెలియజేశారు. మహాత్మా జ్యోతిబా ఫూలే తొలి ఆంగ్ల మాధ్యమ బడిని స్థాపించారు. జాతీయోద్యమంలో అనుసంధాన భాషగా ఉండి విద్యావంతులను ఏకం చేసింది ఇంగ్లిష్. ఈ క్రమంలోనే స్వాతంత్య్రానంతరం.. సహాయ అధికార భాషగా (అఫీషియల్ సపోర్టింగ్ లాంగ్వేజ్) రాజ్యాంగం గుర్తించింది. స్వాతంత్య్రం తర్వాత భాషా రాజకీయాల వల్ల తొలుత రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టలేదు. కానీ ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని విద్యాసంస్థల్లో, ప్రైవేట్ విద్యాసంస్థలలో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. కాలక్రమంలో జ్ఞాన విస్ఫోటనం సంభవించి, ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలు అనూహ్యమైన మార్పులకు లోనవుతున్న సందర్భాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఇది అవకాశాలలో అసమానతలకు దారితీసింది. ప్రాంతీయ భాషలలో చదువుకున్న విద్యార్థులను న్యూనతాభావానికి గురిచేసింది.
తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన 2014 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంగ్ల మాధ్యమానికి సముచితమైన ప్రాధాన్యం ఇచ్చారు. సౌకర్యాలపరంగా, నాణ్యతా ప్రమాణాల పరంగా ఉత్తమస్థాయిలో ఉన్న వెయ్యికి పైగా ఇంగ్లిష్ మీడియం గురుకులాలను ప్రారంభించారు. ఇదే సమయంలో మాతృభాష ప్రాధాన్యం తగ్గకుండా, అన్ని విద్యాసంస్థల్లో తెలుగును తప్పనిసరి ద్వితీయ భాషగా చేశారు. ఈ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభా పాటవాలను చాటుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో కూడా ఇవేతరహా ఫలితాలొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వరంగంలో ఉన్న 41,337 పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం గొప్ప ముందడుగు. ప్రపంచీకరణ యుగంలో తెలంగాణ భవిష్యత్తు తరాలకు గ్లోబల్ భాషపై పట్టు ఉండటానికి, వారు ఎంచుకున్న రంగంలో వికాసం చెందటానికి ఈ చర్య దారితీస్తుంది. అంతేకాకుండా, కేంద్రంలోని మోదీ సర్కార్ అమలు చేయనున్న నూతన విద్యా విధానంలో పాఠశాల విద్యను మాతృభాషలోనే బోధించాలన్న అభివృద్ధి నిరోధక సూచనను నిర్వీర్యం చేయడానికి ఈ చర్య తోడ్పడుతుంది.
విద్యను సేవా దృక్పథంతో అందిస్తామనే అభ్యర్థనతో ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటాయి. కానీ, ఆచరణలో 99 శాతం విద్యాసంస్థలు విద్యను సరుకుగా మార్చి వ్యాపారమయం చేశాయి. సామాన్య ప్రజల సంపాదనలో 50 శాతానికిపైగా ఈ సంస్థలు దోచుకుంటున్నాయి. దీన్ని నివారించడానికి ‘జీవో 1, 1993 రూల్స్’ ఉన్నాయి. కేసీఆర్ తొలి క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి ఈ జీవో నెంబర్ 1ని అమలుచేయడానికి, ఫీజుల నియంత్రణకు ‘ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ’ని ఏర్పాటుచేశారు. జీవో 1, 1993 ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజుల్లో ఐదు శాతం మాత్రమే యాజమాన్యం ఉపయోగించుకోవాలి. 15 శాతం పాఠశాల నిర్వహణ, 15 శాతం వసతుల కల్పన, 50 శాతం ఉద్యోగుల వేతనాల కోసం, 15 శాతం ఫీజులను ఉద్యోగుల సంక్షేమం కోసం ఉపయోగించాలి. కానీ, ఏ ప్రైవేటు విద్యాసంస్థ కూడా దీన్ని అమలుచేస్తున్న దాఖలాలు లేవు. ఏటా ఫీజులను పెంచుకుంటూ పోయి దోపిడీ కేంద్రాలుగా ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు మారుతున్నాయి. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ విద్యాసంస్థల నియంత్రణ, కాపిటేషన్ ఫీజు నిషేధ చట్టం 1983, సబ్ రూల్-7ను ప్రైవేటు విద్యాసంస్థలలో అమలుచేయాలని సూచించింది. జిల్లా స్థాయిలో ఫీజుల నియంత్రణ అథారిటీని ఏర్పాటుచేయాలని సూచించింది. ఇది ప్రైవేటు విద్యాసంస్థల ఆదాయ వ్యయాలను పరిశీలించి ఫీజుల పెంపుపై తగిన సూచనలను ఇస్తుంది. పై అంశాల నేపథ్యంలో ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు పటిష్ఠమైన చట్టం తీసుకురావాలి.
తక్కువ సమయంలోనే విద్యుత్తు, వ్యవసాయం, సంక్షేమ రంగాలలో అద్భుతమైన ఫలితాలను ప్రజలకు అందించిన సీఎం కేసీఆర్.. తనదైన విద్యా తాత్వికతతో తీసుకువస్తున్న విద్యారంగ సంస్కరణలను పౌరసమాజం, ప్రజాతంత్ర విద్యార్థి, ఉద్యోగ సంఘాలు స్వాగతించాలి. వాటి అమలు ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలి. ప్రభుత్వ బడుల వికాసం కోసం పూర్వ విద్యార్థులు, వ్యాపారసంస్థలు సామాజిక బాధ్యతతో పనిచేయాలనే కేసీఆర్ పిలుపును అందుకోవాలి. ప్రభుత్వ బడులు సంతోష జ్ఞానశాలలుగా విలసిల్లాలి. అన్నివర్గాల పిల్లలు ‘అమ్మా! మేం ప్రభుత్వ బడులకు వెళ్తాం’ అనే నినాదం తెలంగాణలో మార్మోగాలి. ఆధునిక విద్య ఫలాలు అందరికీ లభించే, అసమానతల్లేని నవ తెలంగాణ నిర్మాణంలో అందరం మమేకం కావాలి.
(వ్యాసకర్త: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యదర్శి)
అస్నాల శ్రీనివాస్
96522 75560