Adilabad | చెన్నూర్, మార్చి 5 : మంచిర్యాల జిల్లా కిష్టంపేటకు చెందిన రావుల రమేశ్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్, అటో నడుపుకుంటూ, ఎవరైనా పిలిస్తే కారు డ్రైవింగ్కు కూడా వెళ్తుంటాడు. కానీ కుటుంబ పోషణకు ఇది సరిపోదని భావించాడు. అత్తగారి ఊరు కోటపల్లి మండలం కొల్లూరులో తనకున్న 30 గుంటల భూమిలో పంటలు సాగు చేయాలని నిశ్చయానికి వచ్చాడు.
నాలుగేళ్ల క్రితం కారు డ్రైవర్గా రాజమండ్రి వెళ్లినప్పుడు అక్కడ నర్సరీలో ఆపిల్ బేర్ మొక్కలను కొనుగోలు చేసి ముందుగా ఇంటి ఆవరణలో పెంచాడు. ఏడాది తర్వాత కాత వచ్చి ఏకంగా రెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇలాంటి ఆపిల్బేర్ మొక్కలను పెంచితే అదనపు ఆదాయం పొందవచ్చనే ఆలోచన ఆయనకు తట్టింది. రుచికరమైన, నాణ్యమైన ఆపిల్ బేర్ మొక్కలు, సాగు విధానం కోసం యూ ట్యూబ్లో వెతికాడు. కశ్మీర్ యాపిల్ బేర్ బాగుంటుందని తెలుసుకొని, ఓ వ్యాపారి ద్వారా బంగ్లాదేశ్ నుంచి తెప్పించుకున్నాడు. ఒక్కో మొక్క ట్రాన్స్పోర్టు కోసం గాను రూ 350 చొప్పున చెల్లించి 150 మొక్కలను తెప్పించాడు. మొక్కలు బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్టుకు రాగా , అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి వరకు తుమ్మ చెట్లతో బీడుగా ఉన్న 30 గుంటల భూమిని జేసీబీతో చదును చేయించాడు. రెండేళ్ల క్రితం 20 గుంటల భూమిలో ఆపిల్ బేర్ మొక్కలను నాటాడు.
మిగతా 10 గుంటల్లో కూరగాయలు సాగు చేస్తున్నాడు. వంకాయ, అల్చంత, టమాట వేశాడు. సేంద్రియ పద్ధతిలో ఈ పంట వేశాడు. ఇక్కడ కూడా రూ. 3వేలు ఖర్చు చేసి సోలార్ ట్రాపర్ను ఏర్పాటు చేశారు. ఈ ట్రాపర్ చీడపీడలను ఆకర్షించి వాటిని చంపుతుంది. దీంతో నాణ్యమైన కూరగాయలు దిగుబడి వస్తుంది. ఈ కూరగాయలను రెండు రోజులకోసారి మార్కెట్కు తీసుకెళ్లి హోల్సేల్గా విక్రయిస్తే రూ. 2,000 – రూ 2,500 వరకు ఆదాయం వస్తున్నది. ఇలా నెలకు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు ఆదాయం పొందుతున్నాడు. వేసవికాలంలో ఆయితే ధరలు అధికంగా ఉంటాయని, అప్పుడు కొంచెం ఆదాయం ఎక్కువ వస్తుందని ఆయన తెలిపారు.
30 గుంట భూమిలో ఏడాదికి రూ 4.50 లక్షల ఆదాయం పొందుతున్నాడు రావుల రమేశ్. ఆపిల్ బేర్ 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, సుమారు రూ. 2.50 లక్షల వరకు ఆదాయం వస్తున్నదని ఆయన తెలిపారు. 10 గుంటల్లో సాగు చేసిన కూరగాయలతో రెండు రోజులకోసారి మార్కెట్కు తీసుకెళ్లి విక్రయిస్తుండడంతో ఏడాదికి రూ. 2 లక్షల వరకు ఆదాయం వస్తున్నది. కశ్మీర్ ఆపిల్ బేర్ను తన ఇంటికే వచ్చి వ్యాపారులు, స్థానికులు కొనుకెళ్తున్నట్లు తెలిపాడు.
మొక్కలు నాటిన తర్వాత 9 నెలలకు ఆయనకు తొలి ఆదాయం వచ్చింది. మొదటి సంవత్సరం మాత్రమే పెట్టుబడి అవసరం ఉంటుంది. ఒక్కసారి నాటితే దాదాపు 30 ఏండ్ల వరకు ఆదాయం వస్తుంటుంది. కాగా మొదట మొక్కల కొనుగోలు, వాటి రవాణాకే రూ. 50 వేల వరకు ఖర్చు వచ్చినట్లు రమేశ్ తెలిపాడు. కోతుల బెడద ఎక్కువగా ఉన్నందున రూ. 6వేలతో సోలార్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేయించాడు. ఇక ఎరువులు, పెరమ్రాన్ ట్రాపర్స్కు రూ 6వేలు ఖర్చు వచ్చింది. కాపు పూర్తైన తర్వాత చెట్లను కత్తిరించాలని, ఆ తర్వాత అవి చిగురించి తిరిగి కాత కాస్తాయి. తొమ్మిది నెలలకు కాపు వస్తే మొదటి సంవత్సరం మాత్రం 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. రెండో ఏడాది నుంచి 220 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందాడు. క్వింటాలుకు రూ 10 వేల చొప్పున రూ 2లక్షల వరకు ఆదాయం పొందినట్లు సంతోషంగా చెప్పాడు.
నాలుగేళ్ల క్రితం కారు డ్రైవర్గా రాజమండ్రికి వెళ్లిన. అక్కడ కారు యజమాని నర్సరీలో మొక్కలు కొనేందుకు వెళ్లాడు. నేను కూడా ఒక ఆపిల్ బేర్ మొక్కను తెచ్చిన. ఇంటో ఆవరణలో నాటితే ఏడాదికి కాపు వచ్చింది. దిగుబడి అధికంగా రావడంతో ఆపిల్ బేర్ సాగు చేయాలనే ఆలోచన తట్టింది. అందుకే మా అత్తగారి ఇంటి వద్ద తుమ్మ చెట్లతో బీడుగా ఉన్న పెరడులో ఈ పంట వేయాలని నిశ్చయించుకున్న. యూ ట్యూబ్లో చూసి ఓ వ్యాపారి ద్వారా బంగ్లాదేశ్ నుంచి కశ్మీర్ ఆపిల్ బేర్ మొక్కలు తెప్పించా. 20 గుంటల్లో అవే మొక్కలు నాటి, ఇప్పుడు కాతను అమ్ము తున్న. మరో 10 గుంటల్లో కూరగాయలు కూడా వేసిన. డ్రైవర్గా పనిచేస్తూనే అదనంగా రూ 4.50 లక్షల వరకు ఆదాయం ఈ పంటలతో పొందుతున్న. తక్కువ భూమి ఉన్నా ఇలా వినూత్న పంటలు సాగు చేస్తే మేలు కలుగుతుంది.
-రావుల రమేశ్