న్యూఢిల్లీ, జనవరి 5: విద్యుత్తో నడిచే వాహనాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. గత నెలలో దేశవ్యాప్తంగా విక్రయాల్లో 240 శాతం వృద్ధి నమోదైంది. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో క్రమంగా ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించడంలో భాగంగా ఈవీలను కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతున్నారని జేఎంకే రీసర్చ్ సర్వేలో వెల్లడైంది. గత నెలలో 50,868 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2020 ఏడాది చివరి నెలలో అమ్ముడైన 14,978లతో పోలిస్తే 240 శాతం ఎగబాకాయని తెలిపింది. మరోవైపు డిసెంబర్లోనే ఏకంగా 50 వేల ఈవీ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిపింది. నవంబర్లో 42 వేల యూనిట్లు జరిగాయి. ఈవీ రిజిస్ట్రేషన్లలో ద్వి చక్ర, ప్యాసింజర్ త్రి చక్ర వాహనాల వాటా 90 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ఎలక్ట్రిక్ ద్వి-చక్ర వాహనాల వాటా 48.6 శాతంగా ఉండగా..ఎలక్ట్రిక్ కార్ల వాటా 5 శాతం, ఎలక్ట్రిక్ కార్గో త్రి-చక్ర వాహనాల వాటా 4.3 శాతమని వెల్లడించింది.
యూపీ టాప్..
ఈవీల రిజిస్ట్రేషన్లలో రాష్ర్టాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. గత నెలలో జరిగిన 50 వేల రిజిస్ట్రేషన్లలో 23 శాతం వాటాతో ప్రథమ స్థానంలో నిలిచిందని సర్వే వెల్లడించింది. ఈ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర(13 శాతం), కర్ణాటక(9 శాతం), రాజస్థాన్(8 శాతం), ఢిల్లీ(7 శాతం)లు టాప్-5లో చోటు దక్కించుకున్నాయి. తమిళనాడు కూడా ఏడు శాతం మార్కెట్ వాటా కలిగివున్నది.