‘లీడర్షిప్ ఈజ్ నాట్ పొజిషన్.. ఈజ్ యాన్ యాక్షన్…’ ఈ డైలాగ్ ముఖ్యమంత్రి కేసీఆర్కు సరిగ్గా సరిపోతుంది. ఎలాంటి ఉద్యమాన్నయినా ముందుండి నడిపించడంలో కేసీఆర్ దిట్ట. తెలంగాణ ఉద్యమం ఎన్నోసార్లు ఉవ్వెత్తున ఎగిసిపడింది. కానీ కేసీఆర్ సారథ్యంలోనే దానికి సార్థకత చేకూరింది. రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ ఏర్పాటు కోసం దేశంలోని అన్ని పార్టీల నుంచి మద్దతు లేఖలను కూడగట్టడంలో కేసీఆర్ చూపించిన చొరవ అద్వితీయం. ఏ ఉద్యమం చేపట్టినా దానిగురించి దేశమంతా చర్చించుకునేలా చేయడంలో కేసీఆర్ను మించినవారు లేరంటే అతిశయోక్తి కాదు.
దేశంలో ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ జాతీయపార్టీ అవసరం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఏ వ్యక్తి అయినా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే విజయం సాధిస్తారు. అందుకే కేసీఆర్ ఇప్పుడు మరో ఉద్యమానికి సమాయత్తమవుతున్నారు. దేశం కోసం పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలో ‘బీఆర్ఎస్’ పార్టీ పెట్టి మరో సంచలనం నమోదు చేసేందుకు కదం తొక్కుతున్నారు. దేశంలో ఏడు జాతీయ పార్టీలుంటే, బీజేపీ, కాంగ్రెస్లు మాత్రమే అధికారాన్ని పంచుకుంటున్నాయి. మిగతా జాతీయపార్టీలు ఎప్పుడో ప్రజాదరణ కోల్పోయాయి. అందుకే ఇప్పుడు దేశంలో మరో జాతీయపార్టీ, జాతీయ నాయకుడి అవసరం కనిపిస్తున్నది. మోదీని ఎదురించే నేత కోసం దేశం ఎదురుచూస్తున్నది. దేశానికి ప్రధాని అయినప్పటికీ మోదీకి దేశవ్యాప్తంగా ఆదరణ లేదు. కేవలం ఉత్తరాదిలో గెలిచిన సీట్ల కారణంగానే ప్రధాని కాగలిగారు.
దేశవ్యాప్తంగా ఉన్న నేతలను పరిశీలిస్తే.. కొందరే జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. ముఖ్యమంత్రులు నితీశ్కుమార్, నవీన్ పట్నాయక్, మమతాబెనర్జీ, కేజ్రీవాల్, కేసీఆర్లే తమ రాష్ర్టాల్లో రెండోసారి అంతకంటే ఎక్కువసార్లు ప్రజల మనసును దోచి జాతీయ నేతలుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. బీహార్ సీఎం నితీష్కుమార్ ప్రధాని కాగలిగే నాయకుడే అయినప్పటికీ, తనంతటతానే బీహార్కు పరిమితమైపోయారు. నవీన్ పట్నాయక్ ఒడిశాకే పరిమితమయ్యారు. మమతాబెనర్జీ బెంగాల్ టైగర్లా గర్జిస్తూ మోదీకి సవాలు విసురుతున్నప్పటికీ దక్షిణాది రాష్ర్టాల్లో ఏ మాత్రం సక్సెసవుతారో ఇప్పుడే చెప్పలేం. కేజ్రీవాల్ ఢిల్లీలో చక్రం తిప్పి, ఇప్పుడు పంజాబ్ కింగ్గాను మారిపోయారు. దీంతో భవిష్యత్ నాయకుడని అందరూ అనుకుంటున్నారు కానీ, దక్షిణాది రాష్ర్టాల ప్రజల మనసు దోచుకోవడం అంత సులభం కాదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇటు దక్షిణాదితో పాటు అటు ఉత్తరాదినీ, ఇతర ప్రాంతాలనూ ప్రభావితం చేయగలరు. ఆయన అంతలా ప్రజాభిమానాన్ని చూరగొనడానికి కారణం ఆయన రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న ‘రైతుబంధు’, ‘దళితబంధు’ లాంటి బృహత్తర పథకాలే కారణం. తెలంగాణలో ‘కాళేశ్వరం’ ప్రాజెక్టును రికార్డు స్థాయిలో కేవలం మూడేండ్లలోనే అందుబాటులోకి తెచ్చారంటే ఆయన పనితీరు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలన్ని దేశ ప్రజలకూ అవసరమైనవే. కాబట్టే కేసీఆర్ను దేశ ప్రజలు కోరుకుంటున్నారు. చాలా రాష్ర్టాల్లో ఆయనకు అభిమాన సంఘాలూ ఏర్పడ్డాయి.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న ఈ తరుణంలో దేశంలోని సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు కేసీఆర్. అందుకు అవసరమైన నిపుణులతో చర్చిస్తున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి, విదేశీ వ్యవహారాలు ఎలా ఉండాలన్న వాటిపై లోతైన అధ్య యనం చేస్తున్నారు. కేసీఆర్లో ఉన్న గొప్పతనం ఏమంటే, మేధావులందరినీ ఒక్కతాటిపై తీసుకురాగలగడం. తెలంగాణ సమయంలోనూ మేధావులను ముందుపెట్టే పోరాడారు. ఇప్పుడూ దేశంలోని మేధావులందరితో చర్చిస్తున్నారు. విషయం ఉందనుకుంటే శత్రువుతోనైనా చర్చించేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉంటారు. అందుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్తో చర్చలే తాజా ఉదాహరణ.
ఉండవల్లి చెప్పినట్టుగా కేసీఆర్కు అన్ని అంశాలపై సమగ్ర అవగాహన ఉన్నది. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ను ఇంటర్వ్యూ చేసిన జాతీయమీడియా సైతం ఆయన చెప్పిన సమాధానాలకు వహ్వా అనకతప్పలేదు. ఇక ప్రకాశ్రాజ్, ఉండవల్లి వంటి నేతలైతే, కేసీఆర్తో ఒక్కసారి మాట్లాడిన వెంటనే, అతడితో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించారు. ఆసక్తికర విషయమేమంటే దేశవ్యాప్తంగా సర్వేలు, సలహాల పేరుతో చక్రం తిప్పిన పీకే కేసీఆర్కే సలహాదారుగా మారిపోయారు. ఇది జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పీకే ఒక్కరే కాదు, చాలామంది జాతీయస్థాయి నేతలు కేసీఆర్తో కలిసినడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆహ్వానిం చదగిన పరిణామం.
(వ్యాసకర్త: అడ్వొకేట్, సీనియర్ పాత్రికేయులు)
ఎం.గోపాల్రావు
99663 42223