కోల్కతా, ఆగస్టు 30: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీచేసింది. మనీలాండరింగ్ కేసులో విచారించేందుకు తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు అధికారులు మంగళవారం వెల్లడించారు.
కోల్కతాలోని ఈడీ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం హాజరు కావాలని సూచించారు. ఇదే కేసులో ఆయన మరదలు మేనకా గంభీర్కు సైతం ఈడీ నోటీసులు పంపింది. సెప్టెంబర్ 5న ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి రావాలని సూచించారు. మేనకా లండన్ బ్యాంక్ ఖాతా లావాదేవీలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకొనేందుకు ఆమెను విచారించనున్నట్టు అధికారులు వెల్లడించారు.