న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ప్రధాని మోదీ, కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్గాంధీపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ (ఈసీ) ఎట్టకేలకు స్పందించింది. బీజేపీ, కాంగ్రెస్ చీఫ్లకు గురువారం ఈసీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఈ నోటీసుల్లో ఎక్కడా ప్రధాని మోదీ, రాహుల్గాంధీల పేర్లను ప్రస్తావించలేదు. వారికి వేరు వేరుగా నోటీసులు జారీచేస్తుందా?అన్నదానిపై ఈసీ స్పష్టత ఇవ్వలేదు.
ఈ సందర్భంగా ఈసీ రాజకీయ పార్టీలకు కీలక సూచనలు జారీచేసింది. అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్ల ప్రవర్తనకు, వారి వ్యాఖ్యలకు రాజకీయ పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. రాజస్థాన్లో మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. రాహుల్గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కూడా ఈసీని ఆశ్రయించింది. ఏప్రిల్ 29 ఉదయం 11 గంటల్లోగా ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేకు ఈసీ నోటీసులిచ్చింది.