న్యూఢిల్లీ: యూపీలోని రాయ్బరేలీ, అమేథీ సీట్లకు నామినేషన్ వేసేందుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నది. సంప్రదాయబద్దంగా కాంగ్రెస్ ఫ్యామిలీకి చెందిన ఆ స్థానాల నుంచి ఈ సారి లోక్సభకు ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అమేథీ, రాయ్బరేలీ నుంచి రాహుల్(Rahul Gandhi) లేదా ప్రియాంకా పోటీ చేస్తారన్న సస్పెన్స్ కొనసాగుతున్నది. అయితే ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారో ఇంకా ఆ పార్టీ వెల్లడించలేదు. నామినేషన్ ప్రక్రియ ముగిసేందుకు రెండు రోజులే ఉండడంతో ఆ అంశం కీలకంగా మారింది.
రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. కానీ ఈ అంశంపై తుది నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకోనున్నది. అయితే ఇదే సీటు నుంచి ప్రియాంకా గాంధీ కూడా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ రాహుల్ దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కుటుంబ రాజకీయాలు ఎక్కువే అని ప్రధాని మోదీ పదేపదే ఆరోపిస్తున్న నేపథ్యంలో.. అసలు ఆ స్థానాల నుంచి గాంధీ కుటుంబీకులు ఎవరూ పోటీ చేయవద్దు అన్న నిర్ణయంతో ఉన్నారన్న విషయం కూడా కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.
మరికొన్ని గంటల్లో అమేథీ, రాయ్బరేలీ సీట్ల గురించి ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని ఆయన చెప్పారు. 2004 నుంచి అమేథీలో రాహుల్ గాంధీ పోటీ చేశారు. వరుసగా మూడుసార్లు గెలిచారు. 2019లో మాత్రం స్మృతీ ఇరానీ చేతిలో ఆయన ఓడిపోయారు. 2019లోనే కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేసి గెలిచారు. మే 20వ తేదీన అమేథీ, రాయ్బరేలీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
2004 నుంచి 2024 వరకు రాయ్బరేలీ స్థానం నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. 1999లో తొలిసారి అమేథీ నుంచి సోనియా పోటీ చేశారు. గతంలో ఈ సీటు నుంచి సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ పోటీ చేశారు.