(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్)ను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నది. ‘సర్’ కోసం రాష్ర్టాల ప్రధాన ఎన్నికల అధికారులు (సీఈవో) ఈ నెల 30లోగా సిద్ధంగా ఉండాలని ఈసీ కోరింది. ప్రతి రాష్ట్రంలో చివరిసారి చేపట్టిన ‘సర్’ ఆధారంగా ఓటర్ల జాబితాను సవరించాల్సి ఉంటుందని ఈసీ గుర్తు చేసింది. ఈ క్రమంలో ఇంతకు ముందు ప్రచురించిన రాష్ర్టాల ఓటర్ల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు ఈసీ తెలిపింది. ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని (సర్) అక్టోబర్- నవంబర్ నాటికి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఈసీ సూత్రప్రాయంగా వివరించింది. 2008లో ఢిల్లీలో, 2006లో ఉత్తరాఖండ్లో, 2003లో బీహార్లో చివరిసారిగా ‘సర్’ను నిర్వహించారు. మిగతా రాష్ర్టాల్లో ఈ ప్రక్రియను 2002 నుంచి 2004 మధ్య పూర్తి చేశారు. పలు రాష్ర్టాల సీఈవోలు ఇప్పటికే ఈ జాబితాలను వెబ్సైట్లలో అప్లోడ్ కూడా చేశారు. కాగా బీహార్ తర్వాత దేశవ్యాప్తంగా ‘సర్’ను అమలు చేస్తామని ఈసీ ప్రకటించింది.
ఈ ఏడాది చివర్లో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇటీవల ఈసీ అధికారులు ‘సర్’ చేపట్టారు. 2003 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా దీన్ని నిర్వహించారు. విదేశీ అక్రమ వలసదారులను తనిఖీ చేయటం, వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించటం ‘సర్’ ప్రాథమిక లక్ష్యమని ఈసీ తెలిపింది. అయితే, బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి, లక్షిత ఓటర్లను ఏరివేయడానికే ఈ ‘సర్’ను తీసుకొచ్చారని ప్రతిపక్షాలు విమర్శించాయి. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఎన్నికల సమయంలోనే ‘సర్’ను నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఈసీని సుప్రీంకోర్టు నిలదీసింది. చట్టవిరుద్ధంగా ‘సర్’ ఉన్నట్టు తేలితే, దాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది. బీహార్లో ‘సర్’ ప్రక్రియ చెల్లుబాటుపై అక్టోబర్ 7న తుది వాదనలు వింటామని పేర్కొంది. ఈ కేసు విచారణ జరుగుతుండగానే.. అన్ని రాష్ర్టాల్లో ‘సర్’ను అమలు చేయడానికి ఈసీ సమాయత్తమవ్వడం చర్చనీయాంశంగా మారింది.