న్యూఢిల్లీ : కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహణ కోసం ఫార్మా దిగ్గజం బయోలాజికల్-ఈ చేసుకున్న దరఖాస్తును నిపుణుల కమిటీ తిరస్కరించింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలపై పరీక్షించేందుకు కంపెనీ ఇటీవల అనుమతి కోరింది. కానీ, ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) గురువారం సమావేశమై ప్రతిపాదనను తిరస్కరించింది. కంపెనీ మొదటి, రెండో విడుత ఫలితాల ట్రయల్స్ డేటాను నిపుణుల కమిటీకి అందజేసింది.
సమీక్షలో పరీక్షా ఫలితాలు పూర్తి చేయలేదని, ప్రస్తుత డేటా ఆధారంగా వ్యాక్సిన్ భద్రత, రోగనిరోధక శక్తిని అంచనా వేయలేమని ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. అయితే, మరిన్ని వివరాలు అందివ్వాలని కమిటీ కంపెనీకి సూచించింది. బయోలాజికల్-ఈ కంపెనీ కార్బేవాక్ వ్యాక్సిన్ను తయారు చేసింది. ప్రస్తుతం మూడోదశ ట్రయల్స్లో ఉంది. ట్రయల్స్ పూర్తయిన తర్వాత.. సెప్టెంబర్ 21లోపు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందవచ్చని కంపెనీ భావిస్తోంది. ఈ మేరకు 30కోట్ల మోతాదులు అందించేందుకు కంపెనీ కేంద్రానికి తెలిపింది. గత నెలలో కంపెనీకి కేంద్ర ప్రభుత్వం రూ.1500కోట్లు చెల్లించిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు ట్రయల్స్ 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులపై జరుగుతున్నాయి. అయితే, ఫస్ట్, సెకండ్ ఫేజ్ ట్రయల్స్లో వచ్చిన సంతృప్తికరమైన ఫలితాలను బట్టి పిల్లలపై వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహించొచ్చని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం మూడోదశ ట్రయల్స్ను దేశవ్యాప్తంగా 15 ఆసుపత్రుల్లో 1,268 మందిపై నిర్వహిస్తున్నారు. మరో వైపు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సైతం సింగిల్ డోస్ టీకా ట్రయల్స్కు అనుమతి కోరగా.. ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం మిగతా దేశాల్లో కొనసాగుతున్న ట్రయల్స్ డేటా వివరాలు కోరింది.