BJP | లక్నో, ఏప్రిల్ 27: కేంద్రంలో అధికారం పొందేందుకు కీలకమైన ఉత్తరప్రదేశ్లో కమలానికి ఎదురీత తప్పేలా లేదని విశ్లేషకులు అంటున్నారు. రెండో విడత ఎన్నికల తర్వాత మొత్తం 80 సీట్లున్న యూపీలో బీజేపీ ఎదురుగాలి స్పష్టంగా కన్పించింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై యువ ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ధరల పెరుగుదలకు కేంద్రంలోని బీజేపీనే కారణమని చాలా మంది పేదలు నమ్ముతున్నారు! మరోవైపు రైతుల ఉద్యమం తదితర కారణాల వల్ల రాజ్పుత్లలోనూ కమలనాథుల పట్ల ఆగ్రహం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో కమలనాథులకు నిరాశ తప్పకపోవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఇటీవల జరిగిన ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్లు లీక్ కావడం రాష్ట్రంలోని యువ నిరుద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. రాష్ట్రంలోని పేదలతో పాటు రాజ్పుత్ వర్గాలు కమలం పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయగా, ఆర్ఎల్డీ, బీజేపీ భాగస్వామిగా ఉన్నాయి. బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగింది. మొదటి విడతలో మాదిరిగానే రెండో విడత ఎన్నికల్లో సైతం రాజ్పుత్ వర్గాలు అధికార బీజేపీపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించినట్టు భావిస్తున్నారు. రెండో విడత ఎన్నికలో మూడు స్థానాల్లో వీరి ప్రాబల్యం గణనీయంగా ఉంది. బీజేపీపై రాజ్పుత్లు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్న కోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇండియా కూటమి, బీఎస్పీలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.
ఈ ఎన్నికలు బీజేపీ-ఆర్ఎల్డీ కూటమికి అగ్రిపరీక్ష అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా భాగ్పట్, మథుర, అలీగఢ్ నియోజకవర్గాల్లో ఇరు వర్గాల మధ్య ఎలాంటి పొత్తు ఉన్న లక్షణాలు కన్పించడం లేదని వారు పేర్కొంటున్నారు. అక్కడ అవి ఎడమొహం, పెడమొహం గానే ఉన్నాయని, ఈ రెండు పార్టీల మధ్య ఇటీవల జరిగిన సమావేశాల్లో పార్టీ కార్యకర్తల మద్య విభేదాలు ప్రస్ఫుటంగా కన్పించాయని అంటున్నారు.
యూపీలో బీజేపీ చారిత్రక ఓటమిని చవిచూడబోతున్నదని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ జోస్యం చెప్పారు. రెండో విడత తర్వాత బీజేపీ ఖేల్ ఖతం అన్న విషయం స్పష్టమైందన్నారు. రెండో విడత పోలింగ్ అనంతరం ఆయన మాట్లాడుతూ శుక్రవారం జరిగిన పోలింగ్లో ఒక వింత ధోరణిని పరిశీలించానని తెలిపారు. ఇండియా కూటమికి అనుకూలంగా ఓటు వేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, అదే సమయంలో బీజేపీ ఓటింగ్ శాతంలో తగ్గుదల కన్పించిందని చెప్పారు. వచ్చే ఐదు దశల ఎన్నికల్లో ఆ పార్టీ మరింత బలహీన పడుతుందని చెప్పారు.
ఈసారి యూపీలో రాజకీయ భూకంపం సంభవించబోతున్నదని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. 15 పార్లమెంట్ స్థానాల్లోని గ్రామీణ ఓటర్లలో బీజేపీ పట్ల వ్యతిరేకత వ్యక్తమైందన్నారు.