Odisha | భువనేశ్వర్, మే 9: లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్న ఒడిశాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 24 ఏండ్లుగా నిరంతరాయంగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ను ఈసారి కచ్చితంగా గద్దె దించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. మళ్లీ అధికారంలోకి రావడంతో పాటు అత్యధిక లోక్సభ స్థానాలను సాధించాలని బిజూ జనతాదళ్ (బీజేడీ) ప్రయత్నిస్తున్నది.
ముఖ్యంగా ఒడిశాలో రెండు పార్టీల మధ్య కాకుండా ప్రధాని మోదీ, సీఎం నవీన్ పట్నాయక్ కరిష్మా మధ్య పోటీ నెలకొన్నది. రెండు పార్టీలూ వీరి ఇమేజ్తోనే ఓట్లు పొందాలని ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ఓట్ల శాతాన్ని పెంచుకొని పూర్వవైభవం సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. బీజేపీ, బీజేడీ ఒక్కటేననే వాదనతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నది. మే 13, 20, 25, జూన్ 1న నాలుగు విడతల్లో ఒడిశాలోని 21 లోక్సభ స్థానాలకు, 147 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఫ్రెండ్లీ పార్టీల మధ్య హోరాహోరీ
బీజేపీ – బీజేడీ మధ్య ముందు నుంచి మంచి స్నేహం కొనసాగింది. గతంలో ఈ రెండు పార్టీలు కలిసి అధికారం పంచుకున్నాయి. 2009 ఎన్నికల ముందు ఆ పార్టీలు వేరు పడ్డాయి. అయినప్పటికీ రెండు పార్టీల మధ్య స్నేహం కొనసాగింది. ఎన్డీఏలో బీజేడీ భాగస్వామిగా లేనప్పటికీ కేంద్రంతో స్నేహపూర్వక వైఖరిని అవలంబించింది.
ఈ ఎన్నికల ముందు కూడా రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు జరిగినా సీట్ల పంపిణీ కుదరకపోవడంతో ప్రత్యర్థులుగా రంగంలోకి దిగుతున్నాయి. రాష్ట్రంలో గతంలో బీజేడీ – కాంగ్రెస్ మధ్య పోటీ ఉండేది. 2019లో కాంగ్రెస్ను వెనక్కు నెట్టేసి బీజేపీ ప్రధాన రేసులోకి వచ్చింది. 2019లో బీజేడీ 12 లోక్సభ, 112 అసెంబ్లీ స్థానాలను దక్కించుకోగా, బీజేపీ ఎనిమిది లోక్సభ, 23 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ ఒక లోక్సభ సీటును, 9 అసెంబ్లీ స్థానాలను సాధించింది.
బీజేపీది దేశమంతా ఒక మాట.. ఒడిశాలో మరో మాట
ఒడిశాలో బీజేడీకి చెక్ పెట్టడానికి బీజేపీ.. తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, బీజేడీ కీలక నేత కార్తీక్ పాండియన్ను లక్ష్యంగా చేసుకుంది. సీఎం పట్నాయక్కు ఆయన నమ్మకస్థుడు. దీంతో ఒడిశాలో తమిళ వ్యక్తి పెత్తనం ఏంటి అని ప్రశ్నిస్తూ బీజేపీ ప్రచారం చేస్తున్నది. ఒడియా గొప్పదనం, భాషను లేవనెత్తుతూ పాండియన్ను, బీజేడీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నది. దేశమంతా జాతీయవాద నినాదంతో, దేశ ప్రజలందరూ ఒక్కటేనని చెప్తూ ప్రచారం చేసే బీజేపీ ఒడిశాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వెళ్తున్నది.
మోదీ, నవీన్ పట్నాయక్ మధ్య పోటీ
ఒడిశాలో ప్రధానంగా ప్రధాని మోదీ, సీఎం నవీన్ పట్నాయక్ మధ్యే పోటీ ఉంది. రాష్ట్ర బీజేపీలో చెప్పుకోదగ్గ నేతలు, కేంద్రమంత్రులుగా పని చేస్తున్న వారు సైతం ఉన్నప్పటికీ వీరెవరూ ఒడిశా ప్రజల్లో సీఎం నవీన్ పట్నాయక్కు ఉన్న ఇమేజ్తో పోటీ పడే స్థాయిలో లేరు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రధానంగా మోదీ ఇమేజ్పైనే ఆధారపడింది. మరోవైపు బీజేడీ పూర్తిగా పట్నాయక్ కరిష్మాపైనే నడిచే పార్టీ. అయితే, ఇద్దరి మధ్య పోటీతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కూడా ఉంది. గత ఎన్నికల్లో ఇదే జరిగింది.
ఓట్లు పెంచుకునేందుకు కాంగ్రెస్ ఎత్తులు
2019 ఎన్నికల్లో బలహీనపడి, మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ ఈసారి గణనీయంగా ఓట్లు సాధించి పూర్వవైభవాన్ని సాధించాలని ప్రయత్నిస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేడీ వ్యతిరేక ఓట్లను రాబట్టుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నది. బీజేపీ -బీజేడీ ఒక్కటేననే వాదనను బలంగా ప్రచారం చేస్తున్నది. అయితే, కాంగ్రెస్ ఓట్ల శాతం పెరిగితే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీలి తమకు లాభం జరుగుతుందని బీజేడీ భావిస్తున్నది.