రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మనుషులతో పాటు పశుపక్షాదులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చెరువులు, కుంటలు నీళ్లులేక వట్టి బోవడం.. బోర్లల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో దప్పిక తీర్చు కోవడానికి మనుషులు ఎన్ని కష్టాలు పడుతున్నారో.. జంతువులు, పక్షులు కూడా తల్లడిల్లుతున్నాయి. ఈ క్రమంలో వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి స్టేజీ సమీపంలోని మిషన్ భగీరథ పైపులైన్ వద్ద చిన్న ధారగా లీకవుతున్న నీటితో దాహం తీర్చుకునేందుకు పక్షులు వెంపర్లాడాయి. ఒకదాని తర్వాత మరోటి అక్కడికి చేరుకొని ఎండుతున్న గొంతులోకి నీటి ధారను పోసుకున్నాయి. అలాగే ఎండ వేడిమి నుంచి సేద తీరేందుకు వాటి శరీరాలను నీటితో తడుపుకొని సేదతీరాయి. వీటితోపాటు అటుగా వెళ్తున్న బాటసారులు సైతం ఈ నీటితో దాహార్తిని తీర్చుకుంటున్న దృశ్యాలను ‘నమస్తే తెలంగాణ’ క్లిక్ మనిపించింది.