మహబూబ్నగర్ అర్బన్, ఏప్రిల్ 30 : కాంగ్రెస్ పాలనలో పవర్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. మంగళవారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. అయితే మీటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కరెంట్ పోయింది.. దాదాపు గంటసేపటి వరకు పవర్ రాలేదు. దీంతో చేసేది లేక చీకట్లోనే సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలతో జనం, రైతులు సతమతమవుతున్నారని శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ర్టాన్ని అంధకారంగా కాంగ్రెస్ మార్చుతున్నదని ధ్వజమెత్తారు. కరెంట్ సరఫరాలో కోతలు విధిస్తున్నా రాష్ట్ర మంత్రులు మాత్రం అసలు ఒక్క నిమిషం కూడా కరెంట్ పోవడం లేదని అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటలు వెలుగులు విరజిమ్మాయని గుర్తు చేశారు. వ్యవసాయానికి ఉచితంగా నిరంతరంగా విద్యుత్ సరఫరా చేశామని తెలిపారు. నాటి పాలనకు.. నేటి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని ఎద్దేవా చేశారు. గ్యారెంటీల పేరుతో జనాలను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వానికి ఎంపీ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.