సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 8 : కార్మికులు, కర్షకులు, దళితుల హక్కులను కాలరాస్తున్న మోదీ ప్రభుత్వానికి ఆజాదీకా అమృత్ మహోత్సవాలు నిర్వహించే హక్కు లేదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. సంగారెడ్డిలో జరుగుతున్న కేవీపీఎస్ రాష్ట్ర మహాసభలకు సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
దేశంలో అధికారంలో ఉన్న పాలకులు అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట దేశంలో స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుతున్న మోదీ ప్రభుత్వం దళితులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. బ్రిటిష్ వారి నుంచి దేశాన్ని కాపాడుకొనేందుకు నాడు స్వాతంత్య్ర పోరాటం చేసినట్టుగానే బీజేపీ శక్తుల నుంచి ఈ దేశాన్ని రక్షించుకొనేందుకు మళ్లీ ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.