– ఆదివాసీల అవగాహన సదస్సులో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అనార్కలి
బూర్గంపహాడ్, జూలై 15 : అటవీ హక్కుల చట్టం ప్రకారం చెల్లుబాటయ్యే అటవీ హక్కు పత్రాలు లేకుండా భూముల్లో పోడు సాగు చేయవద్దని, దుక్కులు దున్ని పంటలు వేయొద్దని ముసలిమడుగు సెక్షన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అనార్కలి అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని బుడ్డగూడెం గ్రామంలోని ఆదివాసీలకు అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పోడు సాగుపై జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. చట్ట విరుద్ధంగా అడవులను నరికి ప్రభుత్వ ప్లాంటేషన్లు ధ్వంసం చేసి పోడు సాగు చేస్తే అటవీ చట్టాలు, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా అడవులను ఆక్రమించి పోడు భూములు సృష్టించవద్దని, అడవులకు నిప్పు పెట్టకూడదని, వన్యప్రాణులను వేటాడరాదని, అటవీ సంపదను భావితరాలకు పరిరక్షించడం ప్రతిఒక్కరి బాధ్యత అని వివరించారు.
అటవీ పరిరక్షణలో గ్రామస్తులు అటవీశాఖ సిబ్బందికి సహకరించాలని, ఎలాంటి అక్రమాలు అడవుల్లో జరిగినా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సదస్సులో సోంపల్లి మాజీ సర్పంచ్ తాటి వీరాంజనేయులు, కార్యదర్శి వెంకటేశ్వర్లు, బీట్ ఆఫీసర్లు సోడె శ్రీరాములు, మడకం వీరేందర్, బానావత్ సురేష్, భూక్యా పద్మ, రామ్మూర్తి, నవీన్, ఝాన్సీ, గ్రామస్తులు నాగమణి, బంగారమ్మ, సుభద్ర, పిచ్చమ్మ, రాజమ్మ, రామలక్ష్మి, సరోజిని, సుజాత, జగదీష్, సావిత్రి పాల్గొన్నారు.