నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 13: రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి ధాన్యం సేకరణ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గన్నీబ్యాగులు, రవాణా వాహనాలకు కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకొంటున్నారు. బుధవారం సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించగా, రాష్ట్ర మంత్రులు తమ తమ జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా.. ప్రతి గింజనూ కొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, తేమ శాతాన్ని నిర్ధారించే పరికరాలు, తూకం మిషన్లు, తూర్పారబట్టే యంత్రాలను అందుబాటులో ఉంచాలన్నారు.
వేసవిని దృష్టిలో ఉంచుకొని కేంద్రాల్లో రైతులకు తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తగినన్ని కుర్చీలు, నీడ కోసం షామియానాలు ఏర్పాటుచేయాలని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు తీసుకొచ్చే ధాన్యంలో తేమ, తాలు, దుమ్ము వంటివి లేకుండా రైతుబంధు సమితి అధ్యక్షులు, సభ్యులు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద వ్యవసాయ విస్తరణాధికారి, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు, వ్యవసాయ అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లను విధిగా ప్రదర్శించాలని తెలిపారు. ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటుచేయాలని సూచించారు. రైస్ మిల్లర్లు ముందుగానే సరిపడినన్ని గోదాములు గుర్తించి సిద్ధం చేసుకోవాలన్నారు. వరి కింటాకు రూ.1,960 మద్దతు ధర వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. టోకెన్లు ఇచ్చి, క్రమపద్ధతిలో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో అడుగడుగునా పేచీకి దిగుతున్న కేంద్ర ప్రభుత్వంపై నిజామాబాద్ జిల్లా రైస్మిల్లర్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కేంద్రం ఆధీనంలో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ పలువురు మిల్లర్లు ఆవేదన వెలిబుచ్చారు. కొత్త గన్నీ సంచుల్లోనే బియ్యం ఇవ్వాలని చెప్తున్నారని తెలిపారు. మిల్లర్ల ఆవేదనపై స్పందించిన మంత్రి ప్రశాంత్రెడ్డి.. కేంద్ర సర్కా రు కావాలనే కుట్రలు చేస్తున్నదని అన్నారు.