గద్వాల, జూన్ 7 : గతంలో ప్రతి గ్రామానికి చెరువులే నీటి వనరుగా ఉండేవి. ఆ నీటినే పంటలకు, ఇంటి అవసరాలకు, పశుపక్ష్యాదులకు ఉపయోగించేవారు. ప్రతి కుటుంబం చెరువు నీటిపైనే ఆధారపడేవారు. చెరువులను అభివృద్ధి చేయకపోవడంతో దానికింద ఉన్న ఆయకట్టుకు అంతం త మాత్రంగానే నీరు లభించేంది. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ బృహత్తర కార్యక్రమానికి నాంది పలికారు. చెరువులను పునరుద్ధరించాలని భావించి వాటి కింద ఉన్న ఆయకట్టును ఆందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా మిషన్ కాకతీయ పేరుతో చెరువుల అభివృద్ధికి పూనుకున్నది. ఒండ్రుమట్టి, పూడికతీత పనులను చేపట్టి చెరువులకు మహర్దశ చేకూర్చింది.
561 చెరువులతో.. 22,486 ఎకరాలకు సాగునీరు..
జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోని 8మండలాల్లో 561 చెరువులున్నాయి. వీటిలో 345 చెరువులను రూ.45కోట్ల 6లక్షలతో పునరుద్ధరించి 16,909 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. 261 చెరువుల పనులు రూ.25కోట్ల 45లక్షలతో పూర్తి చేయగా వాటి ద్వారా సుమారు 5,577 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నది. అదేవిధంగా గద్వాల మండలంలోని గుంటిపల్లి పెద్దవాగు వద్ద, బసల్చెర్వు వద్ద దయ్యాల వాగుపై చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.3.49 కోట్లతో పనులు చేపడుతున్నారు. చెక్డ్యాంల ఏర్పాటుతో చెరువుల్లో నీటి నిలువ సామర్థ్యం గణనీయంగా పెరగడంతోపాటు భూగర్భజలాలు పెరిగేందుకు అవకాశం కలిగింది.
మత్స్యకారులకు చేయూత
మత్స్యకారులకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో వారికి ప్రభుత్వం 100శాతం రాయితీపై చేపపిల్లలను పంపిణీ చేసింది. జిల్లాలోని మత్స్యకారులకు వందశాతం రాయితీపై 2015-16 నుంచి 2022-23 వరకు 5కోట్ల95లక్షల44 వేల చేపపిల్లలను చెరువుల్లో వదలింది. దీంతోపాటు ఐఎఫ్డీఎస్ పథకం కింద జిల్లాలో వందశాతం రాయితీపై మూడేండ్లుగా రూ.10కోట్లతో (1,233)మత్స్యకారులకు టీవీఎస్ మోపెడ్లు, ఐస్బాక్సులు, తెప్పలు, వలలు, పుట్లు(53), నాలుగు చక్రాల వాహనాలు, లైఫ్ జాకెట్లు వంటి సామగ్రిని అందించి చేయూతనిచ్చింది. అదేవిధంగా నేషనల్ ఫిషరీష్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా రూ.10లక్షల విలువ చేసే రెండు సంచార మత్స్యవిక్రయ వాహనాలను మహిళా గ్రూపులకు అందజేసి మహిళా మత్స్యకారులను సైతం ప్రోత్సహించింది. తెలంగాణ ఏర్పాటుతో చెరువులకు పూర్వవైభవం రావడంతోపాటు మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి.