మహబూబ్నగర్, జనవరి 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి):పల్లె, పట్నం అంతా నేత్రానందం నెలకొన్నది. ఎక్కడ చూసినా సందడి కనిపించింది. ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు కార్యక్రమం గురువారం షురూ అయ్యింది. వనపర్తి జిల్లా కేంద్రంతోపాటు గోపాల్పేటలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పరీక్షలకు శ్రీకారం చుట్టారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ప్రారంభించారు. ముందుగానే అవగాహన కల్పించడంతో ప్రజలు శిబిరాల వద్ద క్యూ కట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 19,361 మందికి కంటి వైద్యులు, సిబ్బంది ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. అవసరమైన 9,591 మందికి అద్దాలు, డ్రాప్స్ పంపిణీ చేశారు. సమస్యలున్న వారికి ఆపరేషన్లు చేయించేందుకు రెఫర్ చేశారు. పైసా ఖర్చు లేకుండా అందజేసిన కంటి అద్దాలను చూసి వృద్ధుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.
మహబూబ్నగర్, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. పల్లె, పట్టణం తేడా లేకుండా ఒకేసారి ప్రారంభించడంతో శిబిరాల వద్ద సందడి నెలకొన్నది. కేంద్రాలకు వచ్చిన అందరికీ వైద్య బృందాలు కంటి పరీక్షలు చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ షేక్యాస్మిన్బాషాతో కలిసి పరీక్షా విధానాన్ని పరిశీలించారు. అద్దాలను పంపిణీ చేశారు.
మక్తల్ మండలం గుడిగండ్ల, ఆత్మకూర్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజాపూర్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కల్వకుర్తి మార్కెట్ యార్డు, వెల్దండలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్, గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అలంపూర్లో ఎమ్మెల్యే అబ్రహం, చిన్నంబావి మండలం పెద్దదగడలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ద్ధన్రెడ్డి, కొత్తకోట, మదనాపురం మండలం శంకరమ్మపేటలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఉప్పునుంతలలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కోస్గిలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రారంభించారు. గుడిగండ్ల గ్రామంలోని వైద్య శిబిరంలో ఎమ్మెల్యే చిట్టెం ప్రజలకు కంటి పరీక్షలు చేశారు. పెద్దదగడలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి చెకప్ చేయించుకున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు శిబిరాలను తనిఖీ చేశారు. వివిధ గ్రామాల్లో జెడ్పీచైర్మన్లు, చైర్పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యారు. ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని జిల్లా వైద్య శాఖాధికారులు చెబుతున్నారు. కంటి పరీక్షలు చేయించుకొని.. ఉచితంగా మందులు, అద్దాలు తీసుకున్న వృద్ధుల కండ్లలో ఆనందం వెల్లివిరుస్తున్నది. పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు బారులుదీరారు. గ్రామాలు, పట్టణాల్లో నిర్దేశించిన వారందరికీ పరీక్షలు చేస్తామని అధికారులు ప్రకటించారు.