Direct Tax | గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 30 శాతం పెరిగాయి. ఏప్రిల్ నుంచి ఈ నెల 17 వరకు అడ్వాన్స్ పన్ను వసూళ్లు పెరగడంతో ప్రత్యక్ష పన్ను రూపేణా రూ.8.36 లక్షల కోట్లకు పైగా వసూలయ్యాయని కేంద్ర ఆర్థికశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య అడ్వాన్స్ టాక్స్ వసూళ్లు 17 శాతం పెరిగాయి.
`ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.8,36,225 కోట్లకు చేరాయి. గతేడాది (2021-22)లో రూ.6,42,287 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 30 శాతం పెరిగాయి` అని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. ఏప్రిల్ నుంచి ఈ నెల 17 వరకు అడ్వాన్స్ టాక్స్ వసూళ్లు రూ. 2,95,308 కోట్లకు చేరాయని తెలిపింది.
రూ.8,36,225 కోట్ల స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కార్పొరేట్ ఇన్కం టాక్స్ రూ.4.36 లక్షల కోట్లు, వ్యక్తిగత ఇన్కం టాక్స్ రూ.4.36 లక్షల కోట్లు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ రూ.3.98 లక్షల కోట్లుగా ఉంది. రీఫండ్స్ సర్దుబాటు తర్వాత నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7,00,669 కోట్లు (23 శాతం వృద్ధి) నమోదయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య రూ.5,68,147 కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు మాత్రమే జరిగాయి.