హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే ఆన్లైన్ క్లాసులకు 63.38 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్, టీఆర్ఈఐఎస్, యూఆర్ఎస్ పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి వరకు 7,19,385 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఎయిడెడ్ స్కూళ్లలో 4,55,912 మంది విద్యార్థులు చదువుతున్నట్లు తెలిపారు.
టీ శాట్ విద్యా చానెల్ ద్వారా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన ఆన్లైన్ క్లాసులకు విద్యార్థులు హాజరయ్యారు. టీవీల ద్వారా 3,07,154 మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులను వీక్షించగా, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్స్, కంప్యూటర్ల ద్వారా 1,31,130 మంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులను వీక్షించారు. ఆన్లైన్ క్లాసులు జనవరి 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి.