అచ్చంపేట, ఏప్రిల్ 23 : చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం సలేశ్వరానికి భక్తులు పోటెత్తారు. లింగమయ్యను దర్శించుకొని పూజలు చేశారు. శ్రీశైలం రహదారిలో రద్దీ నెలకొనగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. దారి పొడవునా స్వచ్ఛంద సంస్థలు అన్నదానం, అంబలి, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. వేసవి తాపం పెరిగినా లింగమయ్యను చూసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలిరాగా చెంచులే పూజారులుగా వ్యవహరిం చి స్వామికి పూజలు చేశారు. వస్తున్నాం లింగమ య్యా.. వెళ్లొస్తాం లింగమయ్యా.. అంటూ భక్తుల నినాదాలతో అటవీ ప్రాంతమంతా మార్మోగింది. బుధవారంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఎస్సీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాల మేరకు అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులతో భారీ భద్రతా చర్యలు చేపట్టగా అటవీశాఖ ఆధ్వర్యంలో వలంటీర్లను నియమించారు. రాంపూర్ పార్కింగ్ స్థలం వద్ద పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను వలంటీర్లు సేకరించి మన్ననూర్లోని రిసైకిల్ షెడ్డుకు తరలించారు. దాదాపు మూడు ట్రాక్టర్ల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.