పెబ్బేరు, మే 2 : కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. హామీలను గాలికొదిలేసి ప్రజలను నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన శ్రీరంగాపురంలో పర్యటించారు. ఉపాధి కూలీలను కలిసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఆరు గ్యారెంటీలతో ప్రజలను మభ్యపెట్టి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందని.. వాటిని అమలు చేయకుండా మళ్లీ మోసం చేయడానికి ప్రజల ముందుకొస్తున్నదన్నారు. ఆ పార్టీకి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్పీని ఎంపీగా గెలిపించాలని కోరా రు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లొస్తే ఆరు గ్యారెంటీల అమలుపై ఒత్తిడి తీసుకురావొచ్చన్నారు. కేసీఆర్ ప్రచారానికి వస్తున్న జనాధరణను చూసి ఓర్వలేకే కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై ప్రచారాన్ని అడ్డుకుంటున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు శ్రీధర్, శ్రీరంగాపురం సింగిల్విండో అధ్యక్షుడు జగన్నాథం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి, నాయకులు పృథ్వీరాజ్, గౌడనాయక్, మాధవరెడ్డి, సుదర్శన్రెడ్డి, జలీల్ తదితరులు పాల్గొన్నారు.