ఇన్ని ఉదాహరణలు, ఇందరి పేర్లు, కీర్తిశేషులైన వారిని (క్షమించాలి) కూడా ఎందుకు ప్రస్తావించానంటే… విమర్శించేవారికి కొంచెమన్నా వివేకం ఉండాలి. వినేవారికి కొంచెమన్నా విజ్ఞత ఉండాలి! దేశంలో తెలంగాణ కన్నా పెద్ద రాష్ర్టాలు లేవా? మన ప్రాంతం కన్నా సమృద్ధమైన, సకల వనరులున్న నేలలు లేవా? హైదరాబాద్ కన్నా పెద్ద, సంపన్నమైన రాజధాని నగరాలు లేవా?ఆర్థికంగా, శారీరకంగా తెలంగాణ ప్రజల కన్నా ఎక్కువ శక్తియుక్తులున్న జనం లేరా? రాజకీయంగా కేసీఆర్ కన్నా అనుభవం ఉన్న నాయకులు లేరా?బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ కన్నా బలమైన పార్టీ లేదా? తెలంగాణ ప్రభుత్వం కన్నా ఎక్కువ పటిష్ఠమైన (మెజారిటీ గల) ప్రభుత్వం లేదా? తెలంగాణ ఉద్యోగుల కన్నా కష్టపడే ఉద్యోగులు లేరా? మరి.. అభివృద్ధికి ప్రపంచం మొత్తం ప్రామాణికంగా భావించే తలసరి ఆదాయంలో తెలంగాణనే దేశంలో ఎందుకు ముందున్నది?
ఇవన్నీ అట్లుంటే, నిన్నగాక మొన్న ఏర్పడిన, పట్టుమని పదేండ్ల వయసు లేని, జనాభాలో 12వ స్థానంలో, విస్తీర్ణంలో 11వ స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కేసీఆర్. పదేండ్ల కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ తలసరి ఆదాయం 3,12,398 రూపాయలు! ఇది అన్ని రాష్ర్టాల కంటే అత్యధికం. దేశ సగటు కంటే కూడా ఎక్కువ.
చెన్నై, కోయంబత్తూరు, సేలం, మధురై, తిరుచ్చిరాపల్లి, ఈరోడ్, కాంచీపురం, తిరునల్వేలి తదితర అనేక నగరాలతో, రకరకాల ఉత్పత్తి పరిశ్రమలతో, నదీజలాలతో, సాగరతీరంతో, పర్యాటక రంగంతో, తమిళ ప్రాభవంతో వెలుగొందే రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ర్టాన్ని పాలించినవి మూడే మూడు పార్టీలు. కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకే. రాజగోపాలాచారి, కామరాజ్, భక్తవత్సలం, అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, కరుణానిధి, జయలలిత, స్టాలిన్ వంటి మహామహులు ముఖ్యమంత్రులు. ఆ రాష్ట్ర ప్రస్తుత తలసరి ఆదాయం 2,73,288 రూపాయలు.
జ్యోతిబసు, సీపీఎం. దేశంలోనే అత్యధిక కాలం, అంటే 23 ఏండ్ల 137 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత. బెంగాల్ పురాతన రాష్ట్రం, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ప్రస్తుత తలసరి ఆదాయం 1,41,373 రూపాయలు.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అద్వానీ, వాజపేయి, సోనియా గాంధీ, రాహుల్, కల్యాణ్సింగ్, రాజ్నాథ్సింగ్, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్లకు ప్రాతినిధ్యం ఇచ్చిన రాష్ట్రం. ఢిల్లీలో ఎవరు గద్దెనెక్కాలో నిర్ణయించే రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ ప్రస్తుత తలసరి ఆదాయం 73,048 రూపాయలు.
నరేంద్ర మోదీ, బీజేపీ. గుజరాత్ను అత్యధిక కాలం, అంటే 12 ఏండ్ల 227 రోజుల పాటు ఏలిన నాయకుడు. ప్రధాని అయిన తర్వాత కూడా, గత పదేండ్ల నుంచీ ఆయన ప్రధాన కార్యక్షేత్రం గుజరాతే. ఈ పదేండ్లలో కేంద్రం సొమ్ములో సింహభాగం గుజరాత్కే చేరింది. గుజరాతీలు వ్యాపార కౌశలానికి పెట్టింది పేరు. ఆర్థికంగా బలవంతులు. ఇప్పుడు గుజరాత్ ప్రస్తుత తలసరి ఆదాయం 2,81,804 రూపాయలు.
ఇక 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో, నెహ్రూ మొదలుకొని మోదీ దాకా 14 మంది మేధావి ప్రధానమంత్రుల పరిపాలనలో, మొత్తం కాలం కాంగ్రెస్, బీజేపీ ప్రత్యక్ష లేదా పరోక్ష పాలనలోనే ఉన్న దేశంలో సగటు తలసరి ఆదాయం కేవలం 98,374 రూపాయలు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైతో మురిసిపోయే బలమైన రాష్ట్రం మహారాష్ట్ర. ఎక్కువకాలం కాంగ్రెస్, బీజేపీల ఏలుబడిలోనే ఉన్నది. వైబీ చవాన్, వసంతరావు నాయక్, వసంత్ దాదా పాటిల్, శరద్ పవార్, మనోహర్ జోషి, విలాస్రావు దేశ్ముఖ్, బాల్ఠాక్రే తదితర మహామహులు మహారాష్ట్రకు మార్గనిర్దేశం చేశారు. మహారాష్ట్ర ప్రస్తుత తలసరి ఆదాయం 2,42,247 రూపాయలు.
నదులపై అడుగుకో ప్రాజెక్టుతో అబ్బురపరిచే రాష్ట్రం కర్ణాటక. కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్ పార్టీల నుంచి నిజలింగప్ప, దేవరాజ్ అర్స్, రామకృష్ణ హెగ్డే, వీరేంద్రపాటిల్, బంగారప్ప, దేవెగౌడ, ఎస్ఎం కృష్ణ, యడియూరప్ప, సిద్ధరామయ్య తదితర అనేకమంది యోధానయోధులు సీఎంలుగా పనిచేశారు. కర్ణాటక ప్రస్తుత తలసరి ఆదాయం 3,01,673 రూపాయలు.
దాదాపు 60 ఏండ్లు కాంగ్రెస్, టీడీపీ ఏలుబడిలోనే కొనసాగి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కర్రెడ్డి, ఎన్టీ రామారావు తదితర అనేకమంది మహామహుల, చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి ‘ఇంటర్నేషనల్ లీడర్ల’ సారథ్యంలో సాగిన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. 2014లో దాని తలసరి ఆదాయం 8,865 రూపాయలు.
అన్నం ఉడికిందా అని ఒక మెతుకు పట్టుకుని చూసినట్టు, నేను ఒక్క తలసరి ఆదాయాన్ని మాత్రమే తీసుకున్నాను. అదే కాదు; విద్యుత్తు వినియోగంలో, గ్రామీణాభివృద్ధిలో, పట్టణాభివృద్ధిలో, వ్యవసాయ ప్రగతిలో, ధాన్యం ఉత్పత్తిలో, ఉచిత విద్యుత్తులో, ప్రాజెక్టుల నిర్మాణంలో, సకల జన సంక్షేమంలో, అందరికీ తాగునీటి కల్పనలో, ఐటీ ఎగుమతుల్లో, ఉపాధి కల్పనలో, వైద్య సదుపాయాల మెరుగుదలలో, జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో, సాంస్కృతిక వైభవంలో, రియల్ ఎస్టేట్లో.. ఇలా ప్రతి రంగంలోనూ, మెరుగుపడిన మన జీవితాలే నిదర్శనంగా, కేంద్ర ప్రభుత్వ అవార్డుల సాక్షిగా, తెలంగాణే ఎందుకు ముందున్నది? మిగిలిన రాష్ర్టాలు ఎందుకు లేవు?
మానవ వనరులు, సహజ వనరులు కొంచెం అటూఇటుగా అన్ని ప్రాంతాలకూ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని దేశాలు/ రాష్ర్టాలే ఎందుకు అభివృద్ధి సాధిస్తాయి? కొన్ని ప్రాంతాల ప్రజలే ఎందుకు బాగుపడతారు?
89 ఏండ్ల పాటు ప్రత్యక్ష బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతదేశం మహాత్మా గాంధీ నాయకత్వం వచ్చిన తర్వాతే స్వాతంత్య్రాన్ని సాధించుకోగలిగింది. దశాబ్దాల పాటు జాతి వివక్ష ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా, నెల్సన్ మండేలా నేతృత్వం చేపట్టిన తర్వాతే విముక్తి పొందగలిగింది. డెంగ్ జియావో పింగ్ పగ్గాలు చేపట్టిన తర్వాతే చైనా అగ్రరాజ్యంగా మారింది. ఆసియాలోనే అతి చిన్నదైనప్పటికీ సింగపూర్ శక్తిమంతమైన ఆర్థిక కేంద్రంగా మారడానికి కారణం లీ కువాన్ యూ. అణు వినాశనాన్ని చవి చూసినప్పటికీ, జపాన్ ప్రగతిరథంపై పరుగులు తీయడానికి కారణం టెట్సు కటయామా. దక్షిణకొరియా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి, పార్క్ చుంగ్ హీ ఆర్థిక సంస్కరణలే కారణం. విదేశీ మారకం అడుగంటి, బంగారం కుదువపెట్టే దుస్థితిలో చిక్కుకున్న స్వతంత్ర భారతం పీవీ ప్రధాని అయిన తర్వాతే పరువు కాపాడుకోగలిగింది. ప్రగతి బాట పట్టింది. ఇట్లా ఒక ప్రాంతమో, దేశమో అనితరసాధ్యమైన అభివృద్ధి సాధించిందంటే, దానికి కారణమైన, కారకుడైన ఒక నాయకుడు తప్పక ఉంటాడు.
వీరిలాగే ఆధునిక తెలంగాణను నడిపించిన, నడిపిస్తున్న, నిలబెడుతున్న నాయకుడు కేసీఆర్! కేసీఆర్ ఒక్కడే చేసిండా? ఇందులో ప్రజల భాగస్వామ్యం లేదా? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. అందరి పాత్రా ఉంటుంది. కానీ ‘ఓన్లీ ఏ లీడర్ కెన్ మేక్ ఏ డిఫరెన్స్’!
కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాతే ఉద్యమం ఒక రూపుకట్టింది. కేసీఆర్ పోరాటం వల్లే ప్రత్యేక రాష్ట్రం సఫలమైంది. కేసీఆర్ పరిపాలన వల్లే అభివృద్ధి సాధ్యమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే, 2013కు, ఆ మాటకొస్తే 2000-2023కు మధ్య ప్రస్ఫుటంగా కనిపించే తేడా కేవలం ఒకే ఒక్కడు.. ఆ ఒక్కడు కేసీఆర్! ఇది నిర్వివాదం.
గాంధీజీకి ముందు కూడా స్వాతంత్య్ర పోరాటం సాగింది. కానీ గాంధీ వచ్చిన తర్వాతే పరిస్థితి మారింది. డెంగ్కు ముందు కూడా చైనా ఉంది. కానీ డెంగ్ పగ్గాలు చేపట్టాకే ప్రగతి సాధ్యమైంది. పీవీకి ముందు కూడా భారతదేశం ఉంది. కానీ, పీవీ వల్లే ఆర్థికప్రగతి సాధ్యమైంది. అట్లే కేసీఆర్కు ముందు కూడా తెలంగాణ ఉంది. తెలంగాణకు ఇప్పుడున్నవన్నీ కూడా కేసీఆర్ కంటే ముందునుంచే ఉన్నాయి. రెండు జీవనదులున్నాయి. పెద్ద పెద్ద చెరువులున్నాయి. వాగులున్నాయి. వంకలున్నాయి. ఇంతే విస్తీర్ణంలో భూమి ఉంది. ఆ భూమినే నమ్ముకున్న రైతులున్నారు. హైదరాబాద్, ఇతర నగరాలు కూడా ఉన్నాయి. ఏ కాలానికి సరిపడినట్టు ఆ కాలానికి జనాభా ఉంది. పేరుగొప్ప బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలున్నాయి. పేద్ద పేద్ద నాయకులున్నారు.కానీ…
కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాతే ఉద్యమం ఒక రూపుకట్టింది. కేసీఆర్ పోరాటం వల్లే ప్రత్యేక రాష్ట్రం సఫలమైంది. కేసీఆర్ పరిపాలన వల్లే అభివృద్ధి సాధ్యమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే, 2013 (తెలంగాణ ఆవిర్భావాని)కి, ఆ మాటకొస్తే 2000 (ఉద్యమానికి ముందు) సంవత్సరానికి… 2023కు మధ్య ప్రస్ఫుటంగా కనిపించే తేడా కేవలం ఒకే ఒక్కడు.. ఆ ఒక్కడు కేసీఆర్! ఇది నిర్వివాదం.
రానే రాదనుకున్న తెలంగాణను, అద్భుతమైన రాజకీయ వ్యూహంతో తీసుకువచ్చిన వాడు కేసీఆర్. అంతకుముందు అనేకమంది తెలంగాణ యోధులకు సాధ్యం కానిదాన్ని, వారు వాడిన పావులనే మరింత చాకచక్యంగా, స్థిమితంగా, శాంతియుతంగా, రాజకీయంగా కదపడం ద్వారా కేసీఆర్ తెలంగాణను సాధించగలిగాడు. విభజన సమయంలో తెలంగాణ మనుగడపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అవి నిర్హేతుకమేమీ కావు. తెలంగాణ ప్రజలు 2014లో సరైన నిర్ణయం తీసుకోకపోతే అవన్నీ నిజమయ్యేవే! కానీ ప్రజలు తమ నాయకుడిగా కేసీఆర్ను నమ్ముకున్నారు. నాయకుడు వారి నమ్మకాన్ని నిలబెట్టి ఆ భయాలను పటాపంచలు చేశారు.
చిన్న రాష్ట్రంగా తెలంగాణ మనుగడ సాగిస్తుందా? అన్నది నాటి అనుమానం. బెర్లిన్ గోడలు బద్దలు కాలేదా అన్న మాటలు ఆనాడే వినిపించాయి. కానీ తెలంగాణ సుస్థిరంగా మనుగడ సాగిస్తుందని నిరూపించాడు కేసీఆర్.
ప్రభుత్వం రాజకీయంగా సుస్థిరంగా ఉంటుందా? అన్నది నాటి అనుమానం. ఓటుకు నోటుతో ప్రభుత్వాన్ని పడగొట్టే పనులు కళ్లముందే జరిగాయి. దొంగల్ని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని, కెమెరాల సాక్షిగా మరీ కుట్రను తుత్తునియలు చేశాడు కేసీఆర్.
మత కల్లోలాలు చెలరేగవా? అన్నది నాటి అనుమానం. పాతబస్తీ మొదలుకొని, భైంసా దాకా విద్వేషాలు రేపడానికి చేయని ప్రయత్నం లేదు. అయినా పదేండ్లుగా కర్ఫ్యూ అన్నదే లేకుండా చేసి చూపించాడు కేసీఆర్.
కరెంటు కొరతతో చీకట్లు కమ్ముకోవా? అన్నది నాటి అనుమానం. సీలేరు విద్యుత్తు కేంద్రాన్ని ఆంధ్రాకిచ్చి, ఏపీ నుంచి రావాల్సిన కరెంటును రాకుండా చేసి అంధకారంలో ముంచజూశారు. వ్యవసాయానికి ఉచితంతో పాటు అన్ని రంగాలకూ 24 గంటల కరెంటిచ్చి జవాబు చెప్పాడు కేసీఆర్.
హైదరాబాద్లోని ఆంధ్రుల భద్రతకు ముప్పు వాటిల్లదా? అన్నది నాటి అనుమానం. పార్టీలు, కులాల ప్రాతిపదికన వారిని రెచ్చగొట్టడానికి కుతంత్రాలు పన్నారు. కానీ ఆంధ్రా కన్నా హైదరాబాదే బాగుంది అనిపించేలా చేశాడు కేసీఆర్.
తెలంగాణ భూముల ధరలు పడిపోవా? అన్నది నాటి అనుమానం. అమరావతి గ్రాఫిక్లను చూపించి హైదరాబాద్ రియల్టీని దెబ్బతీసే ఎత్తుగడలు వేశారు. కానీ తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో వందెకరాలు కొనేలా తీర్చిదిద్దాడు కేసీఆర్.
హైదరాబాద్ నుంచి పరిశ్రమలు తరలిపోవా? అన్నది నాటి అనుమానం. పరిశ్రమలు పారిపోతున్నాయంటూ వారాల తరబడి వార్తలూ వండి వార్చారు. కానీ ప్రపంచస్థాయి పరిశ్రమలకు దేశంలోనే అత్యుత్తమ డెస్టినేషన్గా హైదరాబాద్ను తీర్చిదిద్ది, ఆంధ్రా పరిశ్రమలను కూడా ఆకర్షిస్తున్నాడు కేసీఆర్.
ఉపాధి, ఉద్యోగాలు లేక తెలంగాణ నుంచి జనం వలసలు పోకతప్పదు అన్నది నాటి అనుమానం. దుబాయి, ముంబాయి, బొగ్గుబాయి, పాలమూరులను చూపించి భయపెట్టే కుట్రలు జరిగాయి. కానీ మనవాళ్ల వలసను అరికట్టి, ఆంధ్రాతో సహా దేశంలోని అనేక రాష్ర్టాల నుంచి తెలంగాణకే వలస కార్మికులను రప్పిస్తున్నాడు కేసీఆర్!
కేవలం కేసీఆర్ ఉన్నాడు కాబట్టి, నాటి అనుమానాలు నిజం కాకుండా పోయాయి. కొత్త భయాలు రాకుండాపోయాయి. లేకుంటే? లేకుంటే ఏం జరిగిందో 60 ఏండ్లు చూడలేదా? ఇప్పటికిప్పుడు కర్ణాటకలో చూడటం లేదా?
ఒక నాయకుడిగా తను నమ్మిన నేలను, తనను నమ్మిన ప్రజలను కేసీఆర్ ఎప్పుడూ మోసం చేయలేదు. ఉద్యమంలోనైనా, పాలనలోనైనా! ప్రజలు, ప్రాంతం బేలగా మారినప్పుడు కేసీఆర్ వారికి బలమయ్యారు. ప్రాంతం బలహీనమయ్యే ప్రమాదం వచ్చినప్పుడు ప్రజాబలాన్నే బలంగా స్వీకరించి చక్కదిద్దాడు. అందుకే కేసీఆర్ ప్రజలు నడిపించే నాయకుడిగా కాకుండా, ప్రజలను నడిపించే నాయకుడిగా మారారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, ఇంజినీర్లే ఇప్పుడూ ఉన్నారు. అప్పుడున్న ప్రజలు, వనరులే ఇప్పుడూ ఉన్నాయి. మరి పదేండ్లలోనే ఇన్ని అద్భుతాలు ఎలా సాధ్యమయ్యాయి? ఎలాగంటే దాని వెనుక ఉన్నది నాయకుడు. ఆ నాయకుడు కేసీఆర్. ప్రతి ఒక్కరిలో ఉన్న బలహీనతను తాను భరించి, బలాన్ని రాష్ట్రం కోసం వాడే చతుర వ్యూహాన్ని అమలుచేసిన వాడు కేసీఆర్. ఈ క్రమంలో ఆయన రిటైర్డ్ ఇంజినీర్లు, ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు, మేధావులు.. ఇలా ఏ ఒక్కరినీ వదల్లేదు. తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దాడుతా అని రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రకటించిన కేసీఆర్, తర్వాత తెలంగాణ వికాస ఉద్యమంలోనూ అదే పంథా అనుసరించారు.
తనను నోటికొచ్చినట్టు తిట్టిన వారిని సైతం, తెలంగాణ కోసం తనతో కలుపుకొనిపోయారు. కలుపుకొనిపోతున్నారు. ఆ సమ్మేళనం ఫలితమే ఈ సమ్మిళిత అభివృద్ధి.
పట్టెడన్ని నీళ్లు, బుక్కెడంత బువ్వ, చేతినిం డా పని, కంటి నిండా నిద్ర, లక్షలు విలువైన భూమి, భద్రమైన భవిష్యత్తు.. ఇదీ ఇప్పుడు మన తెలంగాణ! గుండె లోతుల్లోకి వెళ్లి, పదేండ్ల కిందట పడ్డ కష్టాలను తలచుకుని, తరచి చూస్తేగానీ, మారిన బతుకు విలువ తెల్వదు.
పట్టెడన్ని నీళ్లు, బుక్కెడంత బువ్వ, చేతినిం డా పని, కంటి నిండా నిద్ర, లక్షలు విలువైన భూమి, భద్రమైన భవిష్యత్తు.. ఇదీ ఇప్పుడు మన తెలంగాణ! గుండెలోతుల్లోకి వెళ్లి, పదేండ్ల కిందట పడ్డ కష్టాలను తలచుకుని, తరచి చూస్తేగానీ, మారిన బతుకు విలువ తెల్వదు. ఈ మార్పుకు కారణం మన నాయకుడు కేసీఆర్. నిజమైన నాయకుడు మాటల్ని కాదు; పనిని ప్రేమిస్తాడు. నాయకుడు డబ్బును కాదు; తన ప్రాంతాన్ని ప్రేమిస్తాడు. నాయకుడు పదవిని కాదు; తన ప్రజలను ప్రేమిస్తాడు. నాయకుడి ప్రే మకు మనమిచ్చే రిటర్న్ గిఫ్ట్… ప్రేమ మాత్రమే. ప్రేమకు ప్రతిరూపమైన ఓటు మాత్రమే!
వలస పాలనలో మొదలై ప్రత్యేక పాలన దాకా సాగిన ఆధునిక తెలంగాణ ప్రాంత చరిత్రను రాయాల్సి వస్తే, ‘కేసీఆర్కు ముందు, కేసీఆర్ తర్వాత’ అని మాత్రమే రాయాల్సి ఉంటుంది. అంతకుమించి ఆప్షన్ లేదు. తెలివైనవాడు ఎవడైనా అలాంటి కేసీఆర్ను కాదనుకుంటడా? వద్దనుకుంటడా? అనుకుంటే ఎవరికి నష్టం?! చెడిపోయేది కేసీఆర్ కాదు, ఆగమయ్యేది మన బతుకులు!!
ఈ ఎన్నికల తరుణంలో తెలంగాణలోని ప్రతి ఒక్కరూ కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి.
మనకు ఏం కావాలి?
స్వయం పాలనా? ఢిల్లీ పెత్తనమా?
60 ఏండ్లు మనం అరిగోస పడ్డదీ..
13 ఏండ్లు మనం బరిగీసి కొట్లాడిందీ..
వందల మంది బలిదానాలు చేసిందీ..
కేవలం ఈ పదేండ్ల స్వపరిపాలన కోసమేనా?
కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రేపు కర్ణాటక, ఏపీలతో
నీళ్ల పంచాయతీ వస్తే ఆ పార్టీలు ఎటుంటాయి?
తెలంగాణ వైపా? కర్ణాటక వైపా?
మన ఓటు ఎవరికి?, తెలంగాణ ఆత్మగౌరవానికా?
ఢిల్లీ పెద్దల అహంకారానికా?
మన ఓటు ఎవరికి?
తెలంగాణ బిడ్డకా? ఢిల్లీ గడ్డకా?