వరంగల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతున్నాయని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామకు సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని రాయపర్తిలో ఏర్పాటు చేసిన పార్టీ సన్నాహక సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలో అప్రతహతి అభివృద్ధి కొనసాగుతుందన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు గ్రామాలకు అన్ని మౌలిక వసతులు కలిగాయి.
గ్రామాలు దేశానికి ఆదర్శంగా మారాయని మంత్రి తెలిపారు. వచ్చే మూడేండ్ల లో దళితులు అందరికి దళిత బంధును అమలు చేస్తామన్నారు. రాజ్యాంగాన్ని సవరించాలనడం నేరం కాదు.
కావాలని కొందరు కల్పిత వివాదం సృష్టిస్తున్నారని మంత్రి మండి పడ్డారు. అలాంటి వాటిని టీఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. కనీవినీ ఎరగని రీతిలో మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నది.
ఇవన్నీ వివరించడానికే సీఎం కేసీఆర్ జనగామ సభ పెడుతున్నారు. ఆ సభను సూపర్ సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనపై ఉందని, పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా కదలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు.