న్యూఢిల్లీ: పని ప్రదేశాల్లో మహిళల హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘శిశు సంరక్షణ సెలవు’ మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా పేర్కొన్నది. దివ్యాంగుల పిల్లల సంరక్షణలో ఉన్న తల్లికి శిశు సంరక్షణ సెలవు నిరాకరించటాన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించింది. శ్రామికశక్తిలో మహిళలకు సమాన భాగస్వామ్యాన్ని కల్పించటంలో రాష్ట్రం నిర్వర్తించే రాజ్యాంగ విధిని ఇది ఉల్లంఘించటమేనని తెలిపింది.
సోమవారం ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో కేంద్రాన్ని కక్షిదారుగా చేర్చాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భట్ను ఆదేశించింది. దివ్యాంగుల పిల్లల సంరక్షణలో ఉన్న తల్లులకు ‘శిశు సంరక్షణ సెలవులు’ మంజూరు చేయటంపై విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకుగాను రాష్ట్ర సీఎస్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేయాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.