న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్స్ పేరును కేంద్ర ప్రభుత్వం శనివారం మార్చింది. ‘అమృత్ ఉద్యాన్’గా నామకరణం చేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా మొఘల్ గార్డెన్స్ పేరును ఈ మేరకు మార్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా ఈ విషయాన్ని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’గా జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్రపతి భవన్ గార్డెన్స్కు ‘అమృత్ ఉద్యాన్’ అని రాష్ట్రపతి ముర్ము పేరు పెట్టినట్లు చెప్పారు. జనవరి 29న (ఆదివారం) గార్డెన్ కొత్త పేరును ఆమె ఆవిష్కరిస్తారని వెల్లడించారు.
కాగా, జనవరి 31 నుంచి మార్చి 26 వరకు సుమారు రెండు నెలల పాటు ప్రజల సందర్శన కోసం రాష్ట్రపతి గార్డెన్స్ను తెరిచి ఉంచుతారు. అలాగే రైతులు, దివ్యాంగుల సందర్శనకు ప్రత్యేక తేదీలు కేటాయిస్తారు. హెర్బల్ గార్డెన్, మ్యూజికల్ గార్డెన్, స్పిరిచ్యువల్ గార్డెన్, దీర్ఘచతురస్రాకార, పొడవైన, వృత్తాకార ఉద్యానవనాలు వంటి ఎన్నో ప్రత్యేకతలున్న మొఘల్ గార్డెన్స్ను ఇప్పటి వరకు ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచి మార్చి వరకు నెల రోజులు మాత్రమే సాధారణ ప్రజలను సందర్శనకు అనుమతించేవారు.