న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో విలవిలలాడిన ఢిల్లీ.. ప్రస్తుతం కోలుకుంటున్నది. వైరస్ ప్రభావంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించగా.. మే నెలాఖరులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్లాక్ ప్రారంభించారు. ఇప్పటి వరకు పలు ఆంక్షలు ఎత్తివేయగా.. ఆదివారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరిన్ని సడలింపులు ఇచ్చారు. సోమవారం నుంచి సరి-బేసి విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అన్ని దుకాణాలు దుకాణాలు, మాల్స్ తెరిచేందుకు.. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో రెస్టారెంట్లను నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యా, కోచింగ్ సంస్థలు మూసే ఉండనున్నాయి. సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, విద్యా, సాంస్కృతిక, మతపరమైన పండుగలపై ఆంక్షలు కొనసాగుతాయి.
స్విమ్మింగ్ పూల్స్, స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు మూసే ఉంటాయన్నారు. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. అయితే, వారం రోజులు పరిస్థితిని పరిశీలిస్తామని, కేసులు పెరిగితే కఠిన ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. స్పాలు, జిమ్లు, యోగా ఇన్స్టిట్యూట్లు, పబ్లిక్ పార్కులు మూసే ఉండనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్-ఏ అధికారులు వంద శాతం, మిగతా గ్రూపుల్లో 50శాతం సిబ్బంది విధులకు హాజరవుతారు. ప్రైవేటు కార్యాలయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 50 శాతం సిబ్బందితో నిర్వహించుకోవచ్చు.
మార్కెట్ కాంప్లెక్స్లు, మాల్స్ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పూర్తి కార్యకలాపాలు జరుపుకోవచ్చు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లోకి భక్తులకు అనుమతి ఇవ్వలేదు. జోన్కు ఒక వార సంత నిర్వహించేందుకు అనుమతి ఇవ్వగా.. ఫంక్షన్ హాల్స్ హోటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో వివాహాల నిర్వహణకు నిరాకరించారు. 20 మందితో ఇండ్ల వద్ద నిర్వహించుకునేందుకు, అంత్యక్రియల్లో 20 మంది పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. సిటీ బస్సులు 50శాతం సీటింగ్ సామర్థ్యంతో నడిపేందుకు, ఆటోలు, ఈ రిక్షాలు, టాక్సీల్లో ఇద్దరికి మించకుండా నడుపుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.