న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో రికార్డు సాధించింది. అన్లాన్ అమలులోకి వచ్చిన తొలి రోజే 4.5లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చింది. కరోనా సెకండ్ వేవ్ ఢిల్లీపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. దీంతో మేలో లాక్డౌన్ విధించగా.. పలుసార్లు పొడగిస్తూ వచ్చారు. ఇటీవల ఢిల్లీ సీఎం సడలింపులు ప్రకటించగా.. మెట్రో సేవలు 28 రోజుల తరువాత సోమవారం అందుబాటులోకి వచ్చాయి. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కొవిడ్ నిబంధనల మేరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 8 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుస్తుండగా.. తొలి రోజు 4.5లక్షల మంది వినియోగించుకున్నారని డీఎంఆర్సీ తెలిపింది. నిలబడి ప్రయాణిస్తున్న కారణంగా 84 మందిని మెట్రో దింపేయడం జరిగిందని, 73 మందికి మాస్క్ ధరించకపోవడంతో జరిమానా విధించినట్లు చెప్పింది. 106 మందికి మాస్కులు సరిగా ధరించలేదని, సామాజిక దూరం పాటించకపోవడంపై కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించకుండా చూసేందుకు ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు చెప్పింది.