న్యూఢిల్లీ, జూన్ 7: పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం విధివిధానాలు ఇంకా సిద్ధం కాలేదని, చర్చలు జరుగుతున్నాయని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. విధివిధానాలను కోర్టుకు తెలియజేయడానికి కొంత సమయం కావాలని కోరింది. దీనికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లల సంరక్షణకు కేంద్రం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఎంతమంది పిల్లలు అనాథలు అయ్యారన్న విషయంపై జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) ఆరా తీస్తున్నది. దీనికి పశ్చిమ బెంగాల్, ఢిల్లీ సహకారం అందించడం లేదని, అనాథ పిల్లలపై సమాచారం ఇవ్వడం లేదని కమిషన్ తెలిపింది.
అనాథలైన 30 వేల మంది చిన్నారులు
కరోనా సోకి తల్లిదండ్రులను కోల్పోవడమో లేదా ఇతరత్రా కారణాల వల్ల గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది జూన్ 5 వరకు దేశంలో 30,071 మంది చిన్నారులు అనాథలయ్యారని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. వివిధ రాష్ర్టాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్సీపీసీఆర్ ఈ వివరాలను వెల్లడించింది.