న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల కోసం ఈ ఏడాది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల పేర్లు పంపాలని నిర్ణయించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తెలిపారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల సేవలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఈ మేరకు వారిని గౌరవించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పేర్లను ప్రతిపాదించాలని ప్రజలను కోరారు. ఆగస్ట్ 15వ తేదీలోగా అవార్డులకు పేర్లను padmaawards.delhi@gmail.com మేయిల్ చేయాలని సూచించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ.. పేర్లను పరిశీలించి తుది జాబితాను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు చెప్పారు. పద్మ అవార్డులు (పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) నామినేషన్లు, సిఫారసులను సెప్టెంబర్ 15 వరకు పంపాలని కేంద్రం సూచించింది. ఇంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ సైతం అవార్డుల కోసం నామినేట్ చేయాలని ప్రజలను కోరారు.
పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు. 1954లో పద్మ అవార్డులను స్థాపించారు. ఈ అవార్డులు ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. ఈ అవార్డు ‘వర్క్ ఆఫ్ డిస్టింక్షన్’ ను గుర్తించటానికి ప్రయత్నిస్తుంది. కళలు, సాహిత్యం, విద్య, ఆటలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ వంటి అన్ని రంగాల్లో విశిష్టమైన, అసాధాణమైన విజయాలు, సేవలకు ఈ అవార్డు ఇవ్వనున్నారు. కాగా.. వైద్యులు, శాస్త్రవేత్తలు మినహా పీఎస్యూలతో పనిచేసే వారితో సహా ప్రభుత్వ ఉద్యోగులు పద్మ అవార్డులకు అర్హులు కాదు.