హైదరాబాద్ : కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం తగ్గుతున్నది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్ఫ్లో తగ్గుతుతున్నది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 2,17,638 క్యూసెక్కులుగా కాగా.. ఔట్ ఫ్లో 1,73,595 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టు నాలుగు గేట్లు పది అడుగులు ఎత్తి నీటి దిగువకు వదులుతున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను.. ప్రస్తుతం 884.40 అడుగుల మేర నీరుంది.
గరిష్ఠ నీటినిల్వ 215.807 టీఎంసీలకు ఇప్పుడు 212.4385 టీఎంసీలు నిల్వ ఉన్నది. మరో వైపు కుడి, ఎడమగట్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1.09 లక్షల క్యూసెక్కులుండగా.. ఔట్ఫ్లో 68వేల క్యూసెక్కులు ఉన్నది. నాలుగు గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. డ్యామ్ గరిష్ఠ స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 588.2 అడుగుల నీరుంది.
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 306.69 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల డ్యామ్కు సైతం వరద ప్రవాహం తగ్గుతున్నది. ఇన్ఫ్లో 1.86లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. 1.87లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.15 మీటర్లకు.. ప్రస్తుతం 317.72 మీటర్ల నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలకు.. ఇప్పుడు 8.06 టీఎంసీల నిల్వ ఉన్నది.