హుజూరాబాద్ : ఈటల రాజేందర్ దళితబంధు ఆపించడం వల్ల తమకు రాదని దళితసోదరులు ఎవరూ అధైర్యపడొద్దని ఆయన కథ కేవలం పదిరోజులేనని ఎన్నికల తర్వాత అందరికీ దళితబంధు వస్తుందని మండల ఇంచార్జీ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసానిచ్చారు. గురువారం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామం దళిత కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు.
దళిత బంధు పథకం ప్రవేశపెట్టి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. నవశకానికి మరో అంబేద్కర్ కేసీఆర్ అని రవిశంకర్ అన్నారు. దళితులు ఆర్థికంగా ఎదుగుతారనే ఈర్ష్య ప్రతిపక్షాల్లో మొదలైందని, అందుకే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. దళితబంధుతో మూడు సంవత్సరాల్లో దళితుల్లో ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరుతుందన్నారు.
దళితబంధు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు దళితులందరం రుణపడి ఉన్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితబంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్నారని అన్నారు. సబ్బండ వర్గాలు ఆర్థికంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రవిశంకర్ స్పష్టం చేశారు.