బచ్చన్నపేట మార్చి 01 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని విజయ పాల ఉత్పత్తిదారుల కేంద్రంలోనే తమ పాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండలంలోని కొన్నె గ్రామ పాడి రైతులు పాల క్యాన్లతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనగామకు పాలు తరలించడం వల్ల తమకు అన్ని రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే గ్రామం నుంచి జనగాం వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
సకాలంలో బిల్లులు కూడా రావడం లేదని మొరపెట్టుకున్నారు.
ఈ విషయమై మేనేజర్ డిడి, సూపర్వైజర్, బీఎంసీ చైర్మన్ లకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు . తమ సమస్య పరిష్కరిస్తామని చెప్పి జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమ గ్రామానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన బచ్చన్నపేటకి తమ పాలు తీసుకునేలా అనుమతులు ఇవ్వాలని వారు కోరారు. ఈ మేరకు సంబంధిత బాధ్యులు వచ్చి ఇకనుంచి పాలు బచ్చన్నపేటలోనే తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన పాడి రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.