న్యూఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సోమవారం జరుగనుంది. వర్చువల్ విధానంలో జరిగే భేటీలో ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, పార్టీ వైఫల్యం.. భవిష్యత్ ప్రణాళికతో పాటు దేశంలో కరోనా పరిస్థితి, కేంద్రం వైఫల్యాలు, పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై మేథోమధన చర్చ జరుగనుంది. ఈ నెల 7న జరిగిన పార్టీ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో ఎన్నికల ఫలితాలపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఎన్నికల్లో పార్టీ పనితీరు అధ్వాన్నంగా ఉందని, ఫలితాలు ఇలా ఉంటాయని తాము ఊహించలేదని సోనియా అన్నారు. అందువల్లే సమగ్ర సమీక్షకు ఈ నెల 10 న పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సి ఉందన్నారు. కేరళ, అసోం రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనువుగా మలచుకోవడంలో పార్టీ ఘోరంగా విఫలమైంది. కేరళలో ఎల్డీఎఫ్, అసోంలో బీజేపీ కూటములు విజయం సాధించాయి.
పుదుచ్చేరిలో అధికారం చేజారిపోగా.. ఎన్నికల్లో కేవలం రెండు సీట్లను మాత్రం కాంగ్రెస్ దక్కించుకోగలిగింది. బెంగాల్లో వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఒక్క స్థానాన్ని కూడా గెలువలేకపోయింది. కేవలం తమిళనాడులో మాత్రమే కాంగ్రెస్కు కాస్త ఊరట కలిగించే ఫలితాలు వచ్చాయి. డీఎంకేతో పొత్తుతో 18 నియోజకవర్గాల్లో గెలుపొందింది. ఎన్నికల ఫలితాలపై సీనియర్ నేతలు పార్టీ నాయకత్వంపై ఘాటుగానే వ్యాఖ్యానించారు. పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ట్విట్టర్, ఫేస్బుక్ నుంచి బయటపడాలన్నారు.
ఫలితాలపై తీవ్రంగా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఎంతో ఘనచరిత్ర కలిగిన పార్టీ రోజు రోజుకు ప్రాభవం కోల్పోతుండడంపై ఇప్పటికే పలుసార్లు సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, శశిథరూర్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ తదితర నేతలు అధినాయకత్వంపై విమర్శలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం జరిగే వర్కింగ్ కమిటీ సమావేశంపైనే అందరి దృష్టి నెలకొంది.