హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్లతో బీఆర్కేఆర్ భవన్ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణ శాఖ జారీ చేసిన సూచనలు మేరకు రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్లు, అధికారులను సీఎస్ ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నీటి పారుదల , విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తగా పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని సూచించారు.
క్షేత్రస్థాయి అధికారులు , ఉద్యోగులు హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులందరితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. వీసీలో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఫైర్ సర్వీసెస్ డీజీ సంజయ్ కుమార్ జైన్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, సీఎంఓ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, ఎన్డీఆర్ఎఫ్ దామోదర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.