ముంబై, జనవరి 18: అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఒక్కసారిగా భగ్గుమంది. మధ్యప్రాచ్యంలో జరిగిన దాడుల కారణంగా ఇంధన సరఫరాకు ఆటంకం కలగవచ్చన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర మంగళవారం ఏడేండ్ల గరిష్ఠస్థాయి 87.70 డాలర్ల వద్దకు చేరింది. 2014 అక్టోబర్ తర్వాత ఈ స్థాయికి క్రూడ్ ధర పెరగడం ఇదే తొలిసారి. ఇప్పటికే డిమాండ్కు తగ్గ సరఫరాలు లేకపోవడంతో కొద్దిరోజులుగా క్రమేపీ పెరుగుతున్న క్రూడ్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై యెమన్లోని హౌతి గ్రూప్ జరిపిన దాడులతో మంగళవారం 1.5 శాతంపైగా ఎగిసింది. యూఏఈపై జరిగిన డ్రోన్, మిస్సైల్ దాడులతో ఇంధన ట్రక్కులు అగ్నికి ఆహుతయ్యాయి. మరిన్ని చమురు సదుపాయాలపై ఈ ఉగ్రదాడులు జరుగుతాయన్న భయాలు నెలకొన్నాయి. మరోవైపు ఒపెక్ సభ్యదేశమైన రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు పెరగడం కూడా చమురు మంటకు కారణమవుతున్నది. కొన్ని ఒపెక్ సభ్యదేశాలు వాటి కోటాకు అనుగుణంగా చమురును ఉత్పత్తి చేయలేకపోతున్నాయి.
ఈ ఏడాది 100 డాలర్లకు..
ఈ సంవత్సరంలో క్రూడ్ ధర 100 డాలర్ల స్థాయికి చేరుతుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మాన్ శాక్స్ అనలిస్టులు చెప్పారు. ఒమిక్రాన్ కొవిడ్ వేరియంట్తో చమురు డిమాండ్ పెద్దగా తగ్గలేదని, దీంతో సరఫరాలు సరిపోవడం లేదని వారన్నారు. 2022లో క్రూడ్ రోజువారీ డిమాండ్ గతేడాదికంటే 35 లక్షల బ్యారెళ్ళ మేర పెరుగుతుందని, నాల్గో త్రైమాసికంలో రోజువారీ డిమాండ్ 10.16 కోట్ల బ్యారెళ్లకు చేరుతుందని గోల్డ్మాన్ శాక్స్ అంచనావేసింది. ఈ ఏడాది ఓసీసీడీ చమురు నిల్వలు తగ్గిపోతాయని, తాజా డ్రిల్లింగ్ జరగకపోవడం, రష్యా ఉత్పత్తిని పెంచలేకపోవడంతో ఒపెక్ దేశాల మిగులు సామర్థ్యం చారిత్రాత్మక కనిష్ఠానికి పడిపోతుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంచనా వేసింది.
పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు
అసెంబ్లీ ఎన్నికలే కారణం?
క్రూడాయిల్ ధర ఏడేండ్ల గరిష్ఠానికి చేరినా, మంగళవారం దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచలేదు. ఈ ధరల్లో మార్పులేకపోవడం వరుసగా ఇది 74వ రోజు. త్వరలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కారణంగా పెట్రో కంపెనీలు ధరలు పెంచకుండా కేంద్ర ప్రభుత్వం కట్టడి చేసిందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ క్రూడ్ ధరతో అనుసంధానంగా దేశీయ ఇంధన ధరల్ని పెట్రో కంపెనీలు పెంచుతూ వస్తున్నాయి. 2021 అక్టోబర్ 26న ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ఆల్టైమ్ గరిష్ఠం రూ. 110.04, డీజిల్ ధర రూ.98.42 వద్దకు చేరింది. ఆ రోజున ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 86.40 డాలర్లుగా ఉంది. అటుతర్వాత కేంద్రం ఎక్సయిజు సుంకం తగ్గింపు, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ కోతతో పెట్రోల్ ధర రూ.95.41కు, డీజిల్ ధర రూ.86.67కు దిగివచ్చింది. అలాగే ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర డిసెంబర్లో 68.87 డాలర్ల స్థాయికి తగ్గి, మళ్లీ క్రమేపీ పెరుగుతూ ప్రస్తుతం 87 డాలర్లస్థాయిని అధిగమించింది. కాగా 2018 మే నెలలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా 19 రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచలేదు. ఆ సందర్భంలో క్రూడ్ ధర 5 డాలర్లు పెరిగింది కూడా. అప్పుడు ఎన్నికలు ముగిసాయో లేదో పెట్రో కంపెనీలు 2018 మే 14 తర్వాత వరుసగా 16 రోజులు పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతూ పోయాయి.