మరో సమరానికి బీఆర్ఎస్ సిద్ధమైంది.. నాటి ఉద్యమాల గుబాళింపు మళ్లీ విరజిమ్మింది.. నేడు దేశ ప్రగతి కోసం ప్రతినబూనింది.. ఉద్యమనేత, ప్రగతి ప్రదాత కేసీఆర్ పిలుపుతో ఖమ్మం గులాబీమయం అయ్యింది.. బుధవారం జరిగే భారీ బహిరంగసభ వైపు ఊళ్లకు ఊళ్ల్లే స్వచ్ఛందంగా తరలి వస్తున్నాయి.
హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం, జనవరి 17: ఉద్యమాల గు మ్మం.. ఖమ్మం గడ్డ నుంచి జాతిహితం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. బీఆర్ఎస్ పొలికేక దేశం నలుమూలలను తాకనున్నది. కేసీఆర్ ఇక్కడి నుంచే జాతికి తన సందేశాన్ని ఇవ్వనున్నారు. అందుకోసం ఖమ్మం సర్వసన్నద్ధమైంది. ఎటు చూసినా నగరమంతా గులాబీమయమైంది. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించిన తరువాత కరీంనగర్లో నిర్వహించిన తొలి బహిరంగ సభకు జేఎంఎం నేత, జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరెన్ను ఉద్యమ నాయకుడిగా సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. నేడు ఖమ్మం సభకు ముగ్గురు ముఖ్యమంత్రులను, ఒక మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సహా పలువురు జాతీయ నేతలను సీఎం కేసీఆర్ ఖమ్మం బహిరంగసభకు ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఖమ్మం బీఆర్ఎస్ సభకు దాదాపు 13 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చేందుకు లక్షలాది మంది జనం పయనమయ్యారు. ఖమ్మం జిల్లాలోని పాలే రు, వైరా, మధిర, ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్, పాలకుర్తి, సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి కూడా లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలివస్తుండటంతో బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది.
ఆంధ్రా నుంచీ అపూర్వ స్పందన
ఖమ్మం సభకు ఏపీ నుంచి కూ డా భారీ ఎత్తున జనం తరలి రానున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్బా బు సహా పలువురు నేతలు ఖమ్మం సభకు వచ్చే వారికి వాహనాలు సమకూరుస్తున్నా రు.
ప్రతిష్ఠాత్మకంగా సభా ఏర్పాట్లు
ఖమ్మం సభ వేదిక మీద సైతం నేతల ఫొటోలతో ప్రత్యేక ఫ్లెక్సీ పెట్టారు. సభా ప్రాంగణంలో ఏ మూలకు కూర్చున్న వారికైనా అతిథులు కనిపించే విధంగా, వారి ప్రసంగాలు వినపడేలా ఏర్పాట్లు చేశారు. దాదాపు 50 ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చారు.
ఖమ్మం.. ‘గులాబీ’ శోభితం!
బీఆర్ఎస్ స్వాగత తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో ఖమ్మం గులాబీమయమైంది. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ సభకు కనీవిని ఎరుగని రీతిలో నగరం ముస్తాబైంది. ‘నేడు తెలంగాణ ఆచరిస్తుంది.. రేపు దేశం అనుసరిస్తుంది’, ‘దేశానికి తెలంగాణ మాడల్.. యావత్ భారతావనికి కేసీఆర్ రోల్మాడల్’, ‘దేశం రైతాంగం చూపు.. బీఆర్ఎస్ వైపు’ తదితర కొటేషన్లతో ఏర్పాటుచేసిన కటౌట్లు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఖమ్మం జిల్లా చరిత్రలోనే ఇలాంటి బహిరంగ సభ ఇప్పటిదాకా జరుగలేదని పలువురు పేర్కొంటున్నారు.
-ఖమ్మం, ఖమ్మం ఎడ్యుకేషన్