కొడిమ్యాల, ఏప్రిల్ 17 : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరికి నిరసనగా కొడిమ్యాల మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ గడ్డం చంద్రమోహన్రెడ్డితోపాటు వంద మంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్రెడ్డి మాట్లాడారు. 2006 నుంచి 2011 వరకు కొడిమ్యాల ఎంపీటీసీగా, 2013 నుంచి సర్పంచ్గా పనిచేశానని గుర్తుచేశారు. 2014లో పొన్నం ప్రభాకర్గౌడ్, మాజీ మంత్రి జీవన్రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్లో చేరానని చెప్పారు.
2023లో మేడిపల్లి సత్యం ఎమ్మెల్యేగా గెలువడానికి గ్రామగ్రామాన ప్రచారం చేశానని చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే సొంత పార్టీ నాయకులనే శత్రువుల్లాగా చూస్తున్నారని విమర్శించారు. ఇటీవల మల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా వ్యవసాయంపై అవగాహనలేని వ్యక్తిని డబ్బులు తీసుకుని నియమించారని ఆరోపించారు. పార్టీకి రాజీనామా చేస్తున్న విషయం తెలుసుకుని నామినేటేడ్ పదవులు ఇప్పిస్తా అని తన అనుచరులను రాయబారానికి పంపారని, తనతో వస్తున్న కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరించారని ఆరోపించారు.