మర్పల్లి : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బొల్తాపడిన సంఘటన మర్పల్లి మండలంలోని గురంగట్టు తండా సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రయాణికులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి డిపోకు చెందిన టీఎస్ 15 యుడీ 6441 నంబరు గల ఆర్టీసీ బస్సు సంగారెడ్డి నుంచి మోమిన్పేట, మర్పల్లి మీదుగా సుమారు 60 మందికి పైగా వివిధ గ్రామాల ప్రయాణికులతో తాండూర్ వెళ్తుంది. మధ్యాహ్నం 1.30గంటల సమయంలో మర్పల్లి మండలం గురంగట్టు తండా సమీపంలోని మూలమలుపు వద్ద అతివేగంతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. డ్రైవర్ బుజంగం, కండక్టర్ రాజమణితో పాటు బస్సులో ఉన్న 35మందికి పైగా గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు, తాసిల్దార్ తులసీరామ్, సంఘటన స్థలానికి చేరుకుని గాయాలైన క్షతగాత్రులను 108, ప్రైవేట్ వాహనాలలో మర్పల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు చికిత్సలు నిర్వహించగా 14 మందికి చేతులు, కాళ్లు విరిగినట్లు తెలిపారు. తీవ్ర గాయాలైన 9 మందిని సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు 108లో తరలించారు. మిగతా వారు వివిధ వాహనాల్లో సమిపంలోని దవాఖానకు వెళ్లారు.
బంట్వారం మండలం మాలసోమారం ఓకే గ్రామానికి చెందిన 6 మందికి ఎస్ యాదమ్మ, ఎస్ రాజు, మంగలి లక్ష్మయ్య, మ్యాతరి రవీందర్, ఎండీ. షామిమ్, ఎం. లక్షయ్య చేతులు విరిగి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ అజాగ్రత్త వల్లనే బస్సు బోల్తా పడిందని ప్రయాణికులు వాపోయారు. కాగా బస్సు కూడా పూర్తిగా దెబ్బతింది.