కోల్కతా: సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో షాక్ మీద షాక్ తింటున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కాస్త ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకోబోతున్నది. భారత క్రికెటర్ మనోజ్ తివారి ముఖ్యమంత్రి మమతాబెనర్జి సమక్షంలో టీఎంసీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ చిన్సురాహ్ జిల్లాలోని హుగ్లీలో జరిగే ప్రచారసభకు మమతాబెనర్జి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా క్రికెటర్ మనోజ్ తివారీ టీఎంసీ కండువా కప్పుకోనున్నారు.
కాగా, 35 ఏండ్ల మనోజ్ తివారీ ఇప్పటివరకు పశ్చిమబెంగాల్ క్రికెట్ జట్టు కెప్టెన్గా వ్యవహరించారు. బెంగాల్లో చోటా దాదాగా పేరున్న మనోజ్ భారత్ తరఫున కూడా 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రైజింగ్ పుణె సూపర్ జియాంట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.